రామగిరి, డిసెంబర్ 26: ప్రభుత్వ కళాశాలలతో సమానంగా నాణ్యమైన, గుణాత్మక విద్యనందిస్తూ ఉన్నత విద్యావ్యాప్తిలో కీలక భూమిక పోషిస్తున్న అఫ్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని రాష్ట్ర అఫ్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీసీ ప్రకాశ్ కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో గల నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యూనివర్సిటీ కళాశాలలకు దీటుగా తమ కళాశాలల్లో అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన చేస్తూ విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ ఎన్నిక ఉన్నందున జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర కేజీ టు పీజీ విద్యా సంస్థల రాష్ట్ర కన్వీనర్ గింజల రమణారెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని, వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఎంజీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లా కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్రావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు బి. సూర్యనారాయణరెడ్డి, నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వ్యహర్త మారం నాగేందర్రెడ్డి, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.ఆదిత్య, మధుసూదన్రెడ్డి, కె.రామ్మోహన్, కాకతీయ నర్సింహారెడ్డి, ఆంజనేయచారి, ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.