బునాదిగాని కాల్వలోకి కాళేశ్వరం గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. ఈ కాల్వ ద్వారా ఆయా మండలాలను గంగమ్మ ముద్దాడుతూ బీడువారిన భూములను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేయనున్నది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. మూసీ నీటి కోసం తీసిన బునాదిగాని కాల్వలోకి గోదావరి జలాలను మళ్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఓటీ-5 కెనాల్ (ఆఫ్టెక్-5) భువనగిరి మండలం వీరవల్లి వద్ద బునాదిగాని కాల్వ, కాళేశ్వరం ప్యాకేజీ-16 రెండు సమాంతంగా వస్తుండటంతో అక్కడే లింక్ చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే దీనికి సంబంధించి పనులు జరుగనున్నాయి. దాంతో రెండు సార్లు భూసేకరణ, నిధులు, కాల్వ తవ్వకం అవసరం ఉండదు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని ఏడు మండలాల మీదుగా బునాదిగాని కాల్వ ఉండగా ఆరు మండలాల్లో గోదావరి జలాలు పారనున్నాయి. మరో నెల రోజుల్లో ఆత్మకూరు.ఎం వరకు పనులు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
– యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : వృథాగా పోతున్న మూసీ జలాలను వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో బునాదిగానీ కాల్వ పనులు ప్రారంభించారు. 2006లో దీనికి శంకుస్థాపన చేశారు. బీబీనగర్ మండలంలో మక్తానంతారం నుంచి మోత్కూరు మండలంలోని ధర్మారం ఊర చెరువు వరకు కాల్వను నిర్మించాలని నిర్ణయించారు. ఇది భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని ఏడు మండలాల మీదుగా వెళ్తుంది. మొత్తం బీబీనగర్, భువనగిరి, వలిగొండ, మోటకొండూరు, ఆత్మకూరు, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని 48 గ్రామాల్లోని 50 చెరువులను కవర్ చేస్తుంది. 98.6 కిలోమీటర్ల పొడవున కాల్వ నిర్మించనున్నారు. ప్రస్తుతం 56 కిలోమీటర్ల మేర కాల్వ పనులు పూర్తయ్యాయి. మొత్తం 255 స్ట్రక్చర్లు ఉండగా, 31స్ట్రక్చర్లు పూర్తయ్యాయి. 20,575 ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది.
వీరవల్లి వద్ద లింక్..
గతంలో మూసీ నీటిని ఆయా మండలాలకు అందించాలనే లక్ష్యంతో బునాదిగానీ కాల్వ నిర్మాణం చేపట్టారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు కాళేశ్వరం జలాలను తీసుకొచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఓటీ-5 కెనాల్ (ఆఫ్టెక్-5) వీరవల్లి వద్ద బునాదికానీ కాల్వ, కాళేశ్వరం ప్యాకేజీ-16 రెండు సమాంతంగా వస్తున్నాయి. రెండు కాల్వలు పక్కపక్కనే ఉన్నాయి. ఇప్పటికే బునాదిగానీ కాల్వ ఉన్న నేపథ్యంలో రెండు కాల్వలు ఎందుకు అనే యోచనలో అధికారులు ఉన్నారు. కాళేశ్వరం జలాలను బునాదిగానీ కాల్వలోనే పంపించాలని భావిస్తున్నారు. ఇవి రెండు కలపాలని అధికారులు ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపించారు. గతంలో మూసీ సీఈ ఆఫీస్ హైదరాబాద్లో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా నెల క్రితం దీన్ని మనకే కేటాయించారు. దీంతో అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ అందించారు. త్వరలోనే సర్కారు నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది.
అన్ని విధాలుగా మేలు..
ఒక కాల్వను కిలోమీటర్ల మేర నిర్మించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ముందుగా భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. భూములు కోల్పోయే రైతులు ఆందోళనలు చేపడుతారు. భూములు ఇవ్వబోమని భీష్మించి కూర్చుంటారు. వారికి ప్యాకేజీ చెల్లింపుల విషయంలో ఏకాభిప్రాయం రాదు. ప్రభుత్వం ఒక ప్యాకేజీ చెబితే.. రైతులు మరో ప్యాకేజీ కావాలని డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం వందలు, వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిర్మించడానికి ఏండ్ల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు బునాదిగానీ కాల్వ ఇప్పటికే నిర్మాణ చివరి దశలో ఉంది. కాళేశ్వరం ప్యాకేజీ 16.. బునాదిగానీ కాల్వకు లింక్ చేసి.. కాస్త మెరుగులు దిద్దితే ఈ వ్యయప్రయాసలన్నీ తీరనున్నాయి. అందరికీ అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.
భూములన్నీ సస్యశ్యామలం..
బునాదిగానీ కాల్వతో ఆయా మండలాలోని భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయి. కాల్వలోకి నీరు రావడంతో భూగర్భజాలాలు పెరుగనున్నాయి. గ్రామాల్లోని చెరువులు నిండుకుండలా దర్శనమివ్వనున్నాయి. అప్పటి వరకు నీరు లేకుండా పడావు పడిన భూములు కూడా పచ్చని పంటలతో విలసిల్లనున్నాయి. అయితే కాళేశ్వరం జలాలు ఏడాది పొడవునా అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. కాళేశ్వరం జలాలు బీబీనగర్ మండలం మినహా భువనగిరి, వలిగొండ, ఆత్మకూరు, మోటకొండూరు, అడ్డగూడూరుకు అందనున్నాయి. సందర్భాన్ని బట్టి అటు మూసీ, ఇటు కాళేశ్వరం జలాలు రానున్నాయి. మూసీ ఉప్పొంగితే మూసీ జలాలు లేకుంటే కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు రానున్నాయి.
భూముల ధరలకు రెక్కలు..
బునాదిగానీ కాల్వ అందుబాటులోకి వస్తే ఆయా మండలాల పరిధిలో భూముల రేట్లు మరింత పెరగనున్నాయి. ఆయకట్టు ప్రాంతాల్లో ఇప్పటికే భూములు రెట్లు అధికంగా ఉన్నాయి. కాళేశ్వరం జలాలు అందితే ధరలు ఆకాశన్నంటనున్నాయి. ప్రస్తుతం ఎకరం రూ.50 లక్షలకు పైగా పలుకుతున్నది. కాల్వకు రెండు వైపులా రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారు. రైతులకు ఎంతో ఉపయుక్తం కానుంది. ఇప్పటి వరకు పొలాల్లోకి వెళ్లాలంటే బాట లేక భూములు అమ్ముకున్న పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు.
చకచకా కాల్వ పనులు..
బునాదిగానీ కాల్వ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నెల రోజులుగా పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న కాల్వకు మెరుగులు దిద్దుతున్నారు. నాంచారిపేట నుంచి తిమ్మాపూర్ వరకు పనులు పూర్తయ్యాయి. నెల రోజుల్లో ఆత్మకూరు మండలంలో పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. దీంతో ఆలేరు నియోజకవర్గంలోని మండలాల్లో పనులు మొత్తం పూర్తయినట్లు అవుతుంది. కాల్వను సిద్ధం చేసి.. నీళ్లు రాగానే వదలనున్నారు. మూడు నెలల్లో సాగునీరు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇరిగేషన్ శాఖ డీఈ సునీల్ ప్రసాద్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
విప్ సొంత నిధులతో పనులు..
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి తన సొంత నిధులతో కాల్వ పనులను చేపడుతున్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అసంపూర్తి పనులు త్వరగా పూర్తి చేయడానికి ఆమె నడుం బిగించారు.
చిరకాల కాంక్ష నెరవేరుతుంది
మాకు బోరు బావులే దిక్కు. బునాదిగానీ కాల్వతో మా బతుకులు మారుతాయి. కాల్వ ద్వారా జలాలు వస్తే చెరువులు నిండుతాయి. భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. కాల్వకు రెండు వైపులా రోడ్డు వేశారు. గతంలో బాట లేక భూములు అమ్ముకుందామనుకున్నం. ఇప్పుడు సాఫీగా ప్రయాణాలు చేసుకోవచ్చు. భూముల ధరలు కూడా మరింత పెరగనున్నాయి. కాళేశ్వరం జలాలు వస్తే మా అంత అదృష్టవంతులు ఉండరు. మా కల నెరవేరుతుంది.
– ఏశబోయిన నరసింహయాదవ్, రైతు, సర్వేపల్లి, ఆత్మకూరు మండలం