తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాడు అరకొర
వసతులు, మందులతో నడిచిన సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. కొత్త
భవనాలు, వైద్య పరికరాలతోపాటు డాక్టర్లు, సిబ్బందిని నియమించి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దింది. భువనగిరిలోని జిల్లా
కేంద్ర దవాఖాన సరికొత్తగా మారింది. 134 వైద్య పరీక్షలు చేసే డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేసింది. నవజాత శిశు సంరక్షణ యూనిట్, డయాలసిస్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది. ఫిజియోథెరపీ సేవలను కూడా ప్రారంభించింది. నాడు సర్కారు దవాఖానకు రావాలంటేనే రోగులు భయపడే పరిస్థితి ఉండే. నేడు ఓపీతోపాటు ఇన్ పేషెంట్స్ సంఖ్య, డెలివరీలు, సర్జరీలు పెరిగాయి. కిడ్నీ రోగులకు
డయాలసిస్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతున్నది. గతంలో పెద్ద జబ్బు వస్తే హైదరాబాద్కు వెళ్లేవారు, ఇప్పుడు ఇక్కడే చూపించుకుంటున్నారు. భువనగిరి పట్టణంలో కొత్తగా 3 బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఏరియా దవాఖానలో ఫిజియోథెరపీతోపాటు మానసిక రోగుల కోసం సైక్రియాట్రిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కరోనా తర్వాత మానసిక సమస్యలు పెరిగాయని, మతిమరుపు, అతిగా సెల్ఫోన్ వాడకంతో పిల్లలు, పెద్దల్లో వచ్చే సమస్యలకు ఈ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, వృద్ధులు, అనేక రకాల ఒత్తిడులకులోనై మానసిక రుగ్మతులకు గురైన వారికి ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన రోజుల్లో సీహెచ్సీ, పీహెచ్సీలలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నారు. అలాగే మద్యానికి అలవాటైన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వివరాల కోసం 14416 టోల్ ప్రీ నంబర్ను అందుబాటులో ఉంచారు.
భువనగిరి అర్బన్, నవంబర్ 5 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన నామమాత్రంగానే ఉండేది. ఇందులో సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో ప్రథమ చికిత్స మాత్రమే అందించేది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్కు వెళ్లేసరికి రోగి పరిస్థితి విషమంగా మారేది. ప్రైవేటు దవాఖానల్లో వైద్య ఖర్చులు భరించలేని పేదలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటగా వైద్య రంగానికి ప్రాధాన్యమిచ్చి వైద్య సేవలను ఆధునీకరించారు. ఇందులో భాగంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను జిల్లా కేంద్ర ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. దశల వారీగా అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసి స్థానికంగానే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. డయాగ్నోస్టిక్ హబ్, డయాలసిస్ సెంటర్, అధునాతన మార్చురీ, ఉచిత ఫిజియోథెరపీ, నవజాత శిశు సంరక్షణ యూనిట్, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి 108 వాహనాలను సమకూర్చడంతో భువనగిరి పట్టణం మెడికల్ హబ్గా మారింది. రక్త, మూత్ర పరీక్షలు, ఎక్స్రే, స్కానింగ్ ఇతర పరీక్షలన్నీ ఉచితంగా చేస్తుండడంతో ఓపీ, ఇన్ పేషెంట్ల తాకిడి పెరిగింది.
భువనగిరి ఏరియా దవాఖానలో ఉచిత ఫిజియోథెరపీ సెంటర్ను 2023 మే నెలలో ప్రారంభించారు. ఈ సెంటర్లో వృద్ధులే కాకుండా అన్ని వయసుల వారికి చికిత్సను అందిస్తున్నారు. పక్షవాతంతో కాళ్లు, చేతులు, మూతి వంకరపోయిన వారికి.. మోకాళ్లు, నడుం, కండరాలు, మెడ నొప్పుల వంటి చికిత్సలను ఫిజియోథెరపీతో చికిత్స చేసుకోవడానికి వసతి కల్పించింది. ఇందులో ట్రాక్టింగ్, ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ మిషన్లను అందుబాటులో ఉంచడంతో రోజూ 10 నుంచి 15 మంది చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి చొరవతో అధునాతన మార్చురీ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.99లక్షలు మంజూరు చేయగా.. పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది.
నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువగా ఉన్న లేదా పురిటి సమయంలో ఇన్ఫెక్షన్ సోకిన శిశువులను కాపాడేందుకు భువనగిరి ప్రభుత్వ దవాఖానలో నవజాత శిశు సంరక్షణ యూనిట్ను ఏర్పాటు చేశారు. కార్పొరేట్కు దీటుగా రూ.40లక్షలతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 24 గంటల వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందులో అధునాతన పరికరాలు, యంత్రాలు, ఏర్పాటు చేసి పసిరికలు, ఫొటో థెరపి, శ్వాస సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. నెలలో 80 మందికి పైగా చిన్నారులు ఇందులో చికిత్స
పొందుతున్నారు.
60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరిన్ నీటిని తాగడంతో 60 ఏండ్లు పైబడిన వారు ఎక్కువగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. వారంతా వారంలో కనీసం మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. డయాలసిస్ కోసం హైదరాబాద్కు వెళ్లాలంటే రూ.7వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు అవుతున్నది. దీంతో పేదలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేది. కొంతమంది చికిత్స చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా భువనగిరి ఏరియా దవాఖానలో 2023 ఫిబ్రవరి 13న డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి అధునాతన పరికరాలు, సిబ్బందిని నియమించారు. ఇందులో నిత్యం 5 సెషన్స్లలో డయాలసిస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1600లకు పైగా కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్ సెంటర్లలో ప్రతి రోజూ డయాలసిస్ సేవలు అందిస్తున్నారు.
వైద్యాన్ని అందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భువనగిరి పట్టణంలో మూడు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. వాటి పరిధిలో ఉన్న వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలకు అక్కడే ప్రథమ చికిత్స అందిస్తున్నారు. వీటితోపాటు పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో పలువురు వైద్యం పొందుతున్నారు. బస్తీ దవాఖానల ఏర్పాటుతో దూరభారం, ఖర్చులు తగ్గాయని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరి ఏరియా దవాఖానతో పాటు నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రానికి 108 వాహనాన్ని అందజేశారు. ఈ వాహనాలు నిత్యం పేదలకు అందుబాటులో ఉంటున్నాయి.
ప్రభుత్వ ఏరియా దవాఖానలో 2023 జూలై 1న వర్చువల్ విధానంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు టీ హబ్ (టీ డయాగ్నోస్టిక్)ను ప్రారంభించారు. ఇందులో అధునాతన ల్యాబ్, పరికరాలు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించి 134 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నా. దీంతోపాటు పీహెచ్సీలు, సీహెచ్సీలకు అనుసంధానం చేశా. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా రోగుల ఇంటి వద్దే శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్నారు. రిపోర్టుల ఆధారంగా అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. దీంతో పేదలకు ఆర్థిక భారం తగ్గుతున్నది.
భువనగిరి దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లే బాధ, ఖర్చు భారం చాలా తగ్గింది. గతంలో హైదరాబాద్కు వెళ్లిన ప్రతిసారీ రూ.5వేల వరకు ఖర్చు అయ్యేది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మాకు అక్కడికి వెళ్లాలంటే ఖర్చుతోపాటు ఆరోగ్య పరంగా ఇబ్బంది అయ్యేది. కొన్ని సార్లు వెళ్లకపోయేది. వెంట వెంటనే కాకుండా మూడు, నాలుగు రోజులకోసారి పోయేది. భువనగిరిలో పెట్టడంతో సమయానికి వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్న. సెంటర్కు వచ్చిన వెంటనే చికిత్స అందిస్తున్నారు. వచ్చిపోవడానికి ఖర్చు చాలా తక్కువ అవుతుంది. ఇలాంటి సెంటర్ను ఏర్పాటు చేసి మాకు సహకరిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటా.
– గంగదారి చంద్రయ్య, వెల్వర్తి, వలిగొండ మండలం
మా ఇబ్బందులు ఒక్కరోజుతో పోయేవి కావు. గతంలో డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఇబ్బందులతోపాటు ఖర్చు భారం మరింత ఉండేది. సహాయంగా ఒకరిని తీసుకెళ్లాల్సి వచ్చేది. భువనగిరిలో ఏర్పాటు చేయడంతో మా లాంటి వాళ్లకు ఎంతో మేలు కలుగుతుంది. ఉచితంగా చేస్తుండడంతో ఏరియా దవాఖానకు రోజు తప్పించి రోజు వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్న. డాక్టర్లు మంచిగా పలుకరిస్తూ వైద్యం అందిస్తున్నారు. భువనగిరిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. నా లాంటి వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్న సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటా.
– బండి సత్తయ్య, బొమ్మాయిపల్లి, భువనగిరి మండలం