తిప్పర్తి, సెప్టెంబర్ 12 : రాష్ట ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నదని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆయన ఆరోగ్య మహిళా క్లినిక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సౌకర్యాలు, మందులు లేక ప్రజలు సర్కారు దవాఖానలకు వెళ్లాలంటే భయపడేదని, స్వరాష్ట్రంలో అన్ని ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసి డాక్టర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచిందన్నారు. మహిళలు, గర్భినుల కోసం ప్రత్యేక చికిత్స అందిస్తున్నదని తెలిపారు.
ఆరోగ్య మహిళ కేంద్రంలో 138 రకాల వైద్యపరీక్షలు చేస్తారని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వినియోగించుకునేలా వైద్య, ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మీలింగారావు, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, వనపర్తి నాగేశ్వర్రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందుల రేణుక, డాక్టర్ ప్రదీప్ బాబు, సీనియర్ అసిస్టెంట్ అనిల్కుమార్, పల్లె దవాఖానల డాక్టర్లు, వైద్యారోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
మహిళలకు ప్రత్యేకంగా వైద్యం చేయడం బాగుంది
మహిళలు చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఏవైనా జబ్బులు వస్తే ప్రైవేట్ దవాఖానలో చూపించుకోవాలంటే మస్తు పైసలు అయితున్నయి. ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా చికిత్స చేయడం మంచిగా ఉన్నది. ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా ఇస్తున్నరు. గర్భ సంచి సమస్యలు, రొమ్ము క్యాన్సర్ వంటి కూడా చేస్తారంట. పేదల కోసం సర్కారు దవాఖానల్లో అన్ని సదుపాయాలు కల్పించడం బాగుంది.
– తండు లక్ష్మ మ్మ, జంగారెడ్డిగూడెం, తిప్పర్తి