దేవరకొండ రూరల్, జనవరి 6 : పేదల అభ్యున్నతికి ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమక్షంలో కొండమల్లేపల్లి మండలంలోని చిన్న అడిశర్లపల్లి బీజేపీ గ్రామ అధ్యక్షుడు పోతురాజు వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు వుంగిరి వెంకటయ్యతో పాటు 100మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో 1.60లక్షల ఎకరాలకు సాగు నీరందించమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్లో చేరిన ప్రతీ కార్యకర్త పార్టీ సభ్యత్వం తీసుకోవాలని దీంతో రూ.2లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. దేశంలో ఎక్కడా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు కావట్లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రమావత్ దస్రునాయక్, జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేంధర్రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు వస్కుల కృష్ణయ్య, నాయకులు నేనావత్ రాంబాబునాయక్, పసునూరి గోవింద్, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.