స్వరాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇంగ్లిష్ మీడియంలో బోధనతోపాటు డిజిటల్ క్లాసులను పెట్టింది. మనఊరు-మన బడి, మన బస్తీ-మన బడితో సకల సౌకర్యాలు కల్పించింది. నేడు ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకున్నాయి. విద్యార్థుల ఆకలి బాధ తీర్చేందుకు ప్రభుత్వం సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనంతోపాటు కొత్తగా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నది. విద్యార్థులు కూడా చదువుతోపాటు వివిధ రకాల పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,113 ప్రభుత్వ బడుల్లోని 2,37,930 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు.
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి తెచ్చారు. సర్కార్ బడులను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టడంతోపాటు విద్యార్థుల్లో మిటమిన్స్, ఐరన్ లోపం నివారించేలా నిత్యం రాగి జావ, పల్లిపట్టి, వారంలో మూడు సార్లు ఉడికించిన గుడ్డు అందిస్తున్నారు. దీంతోపాటు గత నెల నుంచి ఉదయం రుచికరమైన అల్పాహారం పెడుతున్నారు. నోట్బుక్స్, వర్క్బుక్స్, స్కూల్ యూనిఫామ్ అందిస్తూ పేద విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా చేశారు. తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలతో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం పెరిగింది.
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థుల కడుపు నింపేలా ఉదయం అల్పాహారం అందించడం ఆదర్శనీయం. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్ తగ్గడంతోపాటు హాజరు శాతం పెరిగింది. తల్లిదండ్రులు, విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులుగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వీటితోపాటు ఉదయం రాగి జావ, పల్లిపట్టి, మూడు రోజులు ఉడికించిన కోడి గుడ్డు ఇస్తున్నాం. మధ్యాహ్నం పౌష్టికాహారం పెడుతుండడంతో కడువు నిండా తిని విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు. మన ఊరు – మన బడితో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. దీంతో తల్లిదండ్రులకు మరింత విశ్వాసం పెరిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.
– నవ్వ దమనేశ్వర్రావు, ప్రధానోపాధ్యాయుడు, పద్మానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, నల్లగొండ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,113 ప్రభుత్వ పాఠశాలలుండగా.. వాటిల్లో 2,37,930 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో నల్లగొండ జిల్లాలో 1,485 పాఠశాలల్లో 1,20,877 మంది, సూర్యాపేటలో 909 పాఠశాలల్లో 63,805 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 719 పాఠశాలల్లో 53,248 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ ఉచితంగా ఆంగ్ల విద్యతోపాటు అనేక సంక్షేమ ఫలాలు అందుతుండటంతో చదువులో ప్రతిభ కనబర్చుతున్నారు. మరో వైపు ప్రతి సంవత్సరం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సైన్స్ కాంగ్రెస్, సైన్స్ ఫెయిర్, సైన్స్ డ్రామా, అండర్-14 క్రీడా పోటీల్లో ప్రైవేట్ కంటే ప్రభుత్వ విద్యార్థులే ముందు వరుసలో ఉండి సత్తా చాటుతున్నారు.
మా ఇద్దరు పిల్లలను గతంలో ప్రైవేట్ బడిలో చదివించా. అక్కడ ఫీజుల భారంతో ఇబ్బంది పడ్డాం. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారని తెలిసి మా పిల్లలను అందులో చేర్పించా. పెద్దోడు 5వ తరగతి, చిన్నోడు 4వ తరగతి చదువుతున్నారు. స్కూల్ యూనిఫామ్, నోట్, వర్క్బుక్స్ ఉచితంగా ఇవ్వడంతో ఇప్పుడు ఫీజుల భారం, ఆర్థిక బాధలు తప్పాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతుండడంతో ఇంట్లో పొద్దున్నే వంట చేసి పెట్టే ఇబ్బంది లేదు. తల్లిదండ్రులు సర్కారు వసతులను ఉపయోగించుకుని తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించాలి.
– కె.శేఖర్, విద్యార్థుల తండ్రి, శ్రీరాంనగర్, నల్లగొండ
ప్రైవేట్ స్కూల్ కంటే మా సర్కార్ బడిలోనే చదువు బాగా చెప్తున్నారు. ప్రైవేట్ బడికి అయితే టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్లాలి. పుస్తకాలు కొనాలి. ఇక్కడ ఆ బాధలు లేవు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నం, గుడ్డు, మళ్లీ రాగి జావ, పల్లి పట్టి ఇస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం ఇంట్లో తయారై బడికి వచ్చి టిఫిన్ చేసి, మధ్యాహ్నం అన్నం తిని చక్కగా చదువుకుంటున్నా. ప్రైవేట్ స్కూల్ కంటే మా బడిలో మంచిగా బెంచీలు, వారంలో టీవీ పాఠాలు ఉన్నాయి. బడిలో ఇచ్చిన వర్క్బుక్స్ చాలా బాగున్నాయి. పాఠాలు మంచిగా అర్థం అవుతున్నాయి.
– సృష్టి, 5వ తరగతి, పద్మానగర్, నల్లగొండ