ఉరుకులు, పరుగుల ప్రస్తుత సమాజంలో క్రీడలతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జీజేఆర్ కప్ నియోజకవర్గ స్థాయి ఫైనల్ క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గెలుపోటములు సహజమని వాటిని సమానంగా స్వీకరించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడానికే జీజేఆర్ కబ్ క్రీడా పోటీలు నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా చిన్నారులు, యువకులు, మహిళలు, వృద్ధులు సైతం పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.
సూర్యాపేట టౌన్, జూలై 16 : క్రీడాకారుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే జీజేఆర్ కప్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రత్యేక క్రీడా కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. క్రీడల్లో నియోజకవర్గ వ్యాప్తంగా చిన్నారుల నుంచి యువకులు, మహిళలు, వృద్ధులు సైతం పెద్ద ఎత్తున పోటీపడటంతో పండుగలా ఆటల పోటీలు సాగడం ఆనందంగా ఉన్నదన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న జీజేఆర్ కప్ ఫైనల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరించాలి తప్ప ఓడినవారు నిరుత్సాహ పడకుండా మరో గెలుపునకు ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమానికి ముందు మంత్రి జగదీశ్రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కాసేపు ఆటల పోటీలను తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, డెయిరీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్కుమార్, గుంటకండ్ల వేమన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు తాహెర్పాషా, మడిపల్లి విక్రమ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, ఉప్పల ఆనంద్, రాపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అవయవ దానంపై అవగాహన పెంచుకోవాలి
సూర్యాపేట టౌన్ : అవయవ దానంతో పునర్జన్మ పొందినట్లేనని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్పందన సేవా స్వచ్ఛంద సంస్థ శరీర అవయవ దాతల సంఘం ఆధ్వర్యంలో దివంగత వనమా వెంకటరామయ్య, గుండా వెంకటప్పయ్యల స్మారకార్థం ఏర్పాటు చేసిన సేవాంకిత సంస్మరణ సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవయవ దానం కోసం స్పందన సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. సూర్యాపేటలో ఇరువురి విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కూడళ్లకు వారి పేర్లు పెట్టనున్నట్లు తెలిపారు. అలాగే వాసవీ సేవా సంస్థ వ్యవస్థాపకుడు, ఆర్యవైశ్య ప్రముకుడు దివంగత కేసీ గుప్తా విగ్రహాన్ని పునరుద్ధరించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ విగ్రహాన్ని రోడ్ల విస్తరణలో భాగంగా పక్కకు పెట్టగా, విస్తరణ పూర్తితో మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా విగ్రహ పునరుద్ధరణ చేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టకొండ సత్యనారాయణ, రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, బండారు రాజా, మొరిశెట్టి శ్రీను, గుండా రమేశ్, కోటయ్య, పిచ్చిరెడ్డి, ఇరిగి కోటేశ్వరి, రాచర్ల కమలాకర్ పాల్గొన్నారు.