యాదాద్రి భువనగిరి ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణకు సంబంధించి కీలక గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. భువనగిరి ఆర్డీఓ పరిధిలోని రాయగిరి, గౌస్నగర్, కేసారం, పెంచికల్పహాడ్, తుక్కాపూర్ గ్రామాల్లో 199 హెక్టార్లు సేకరించనున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల శాఖ పేర్కొంది. భూసేకరణకు కాంపిటెంట్ అథారిటీగా ఉన్న యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్ పరిధి, చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలోని గ్రామాలకు సంబంధించి ఏప్రిల్లోనే నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. భువనగిరి ఆర్డీఓ పరిధిలో భూసేకరణకు గెజిట్ ప్రచురితమైన రోజు నుంచి 21రోజుల్లోపు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించారు. ఆయా ప్రాంతాల వారు రోడ్డు నిర్మాణం వల్ల కలిగే నష్టాలు, మార్చులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అభ్యంతరాలు, సూచనలను కాంపిటెంట్ అథారిటీకి అందించవచ్చు. అధికారులు వాటిని పరిశీలించాక సభ నిర్వహించి ఆయా అభ్యంతరాలపై సమాధానాన్ని తెలియజేస్తారు. జాతీయ రహదారుల చట్టం 1956(48) సెక్షన్ 3 సీలోని సబ్ సెక్షన్ 1 ప్రకారం అభ్యంతరాలపై కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశమే తుది నిర్ణయం అవుతుందని గెజిట్లో పేర్కొన్నారు.
హద్దుల గుర్తింపునకు త్వరలో సర్వే…
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంటుకు సంబంధించి ఇప్పటికే మార్కింగ్ చేశారు. గెజిట్ విడుదల నేపథ్యంలో రోడ్డు వెడల్పు 100 మీటర్లు కచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందనేది గుర్తించి హద్దు రాళ్లు పాతనున్నారు. డిపరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పరికరాలతో వీటిని ఏర్పాటు చేస్తారు. అభ్యంతరాలపై సమాధానం వెల్లడించిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరించనున్నారు, దాని యాజమాని ఎవరు అనే వివరాలతో త్వరలో 3డి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.