వేములపల్లి, ఏప్రిల్ 18: మండల పరిధిలోని ఓ గ్యాస్ ఏజెన్సీ సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు ఏజెన్సీ ఒక్కో సిలిండర్ను బ్లాక్లో రూ.2వేలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. యాజమాన్యంపై నమ్మకం లేక శుక్రవారం రాత్రి 8 గంటలకు లోడ్ వచ్చిందని తెలుసుకున్న స్థానిక ప్రజలు 8 గంటల నుంచే గ్యాస్ ఆఫీస్కు ఖాళీ సిలిండర్లతో క్యూకట్టారు. సిలిండర్లు లైన్లో పెట్టి అక్కడే నిద్రపోయారు.
బయటకు తరలించే ప్రయత్నం..
వినియోగదారులు బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ నిమిత్తం ఆటో ల్లో వేసుకొని బయలుదేరుతారు. కానీ వేములపల్లిలో మాత్రం దీనికి విరుద్ధంగా బ్లాక్లో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణ శుక్రవారం లోడ్ కంటే ముందు వచ్చిన లోడ్లో 80 సిలిండర్లు మాయం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ లోడ్లో కూడా 110 సిలిండర్లు మాయం చేసేందుకు ప్రయత్నం చేసిన యాజమాన్యానికి వినియోగదారులు అడ్డుపడి గోదాం వద్దనే శనివారం తెల్లవారుజామున ఆపారనేది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
15 రోజుల సమయం..
సాధారణంగా గ్యాస్ గోడౌన్ యజమానులు స్టాక్ అయిపోగానే లోడ్ కోసం డీడీ తీస్తారు. గోదాంలో స్టాక్ ఇండెంట్ను బట్టి సేల్స్ ఆఫీసర్ అలర్ట్ చేస్తాడు. జీరో స్టాక్ ఉంటే వెంటనే లోడ్ను పంపిస్తారు. కానీ స్థానిక గ్యాస్ యాజమాన్యానికి మాత్రం లోడు లోడుకు మధ్య 15 రోజుల గ్యాప్ వస్తోంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారులు ఫోన్ కాల్ ద్వారానే గ్యాస్ బుక్ చేసుకుంటారు. దీంతో వినియోగదారులకు సంబంధం లేకుండా డెలివరీ మెసేజ్లు వస్తుండటం జాప్యానికి గల ప్రధాన కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. సిలిండర్ డెలివరీ అయినట్లు మెసేజ్ వస్తున్నప్పటికీ సదరు వినియోగదారులకు అందకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఒక్కసారిగా ఎగబడుతున్న వినియోగదారులు
స్థానిక గ్యాస్ యాజమాన్యం లోడ్ తెప్పించుకునే విషయంలో పూర్తిగా విఫలమైందని వినియోగదారులు మండిపడుతున్నారు. ఒక లోడ్ వచ్చిన 15రోజులకు మరో లోడ్ రావడంతో వినియోగదారులు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాయాల్సి వస్తోంది. లోడ్ వచ్చిందని తెలియగానే ఒక్కసారిగా వినియోగదారులు ఎగబడుతుండటంతో ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో సిలిండర్లు అందించేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.