చండూరు, సెప్టెంబర్ 30 : ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని ట్రస్మా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం స్ధానిక గాంధీజీ విద్యా సంస్థల యందు ప్రతి నెల నిరుపేదలకు సాయంలో భాగంగా 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి విలువ గల నిత్యావసర సరుకులను కోడి శ్రీనివాస్, అరుణ దంపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ” కార్యక్రమం ప్రతి నెలా విజయవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
తమ ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని, పేదలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా లభించదన్నారు. తమ ఫౌండేషన్ ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజులతో విద్యనందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, కోడి ప్రీతి, కోడి శృతి, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి పాల్గొన్నారు.
Chandur : నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం : డాక్టర్ కోడి శ్రీనివాస్