నల్లగొండ, మే 18 : రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు నెలలుగా నిధుల విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల గల్లా ఖాళీ అయ్యింది. గత ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో ప్రతి నెలా ఇచ్చే నిధులకు కొత్త సర్కార్ కోత పెట్టడంతో పంచాయతీల పాలన కష్టతరంగా మారింది. పైగా పాలకవర్గాల కాలం తీరిపోవడంతో అత్యవసర ఖర్చులను పంచాయతీ కార్యదర్శుల జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ క్రమంలో ఈ ఐదు నెలల్లో ఒక్కో కార్యదర్శి కనీసం రూ.లక్ష దాకా పెట్టినట్లు తెలుస్తుంది.
2019 సెప్టెంబర్ నుంచి 2023 నవంబర్ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నెలా జిల్లా వ్యాప్తంగా ఉన్న 844 గ్రామ పంచాయతీలకు రూ.20 కోట్ల వరకు నిధులు ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ కాంపోనెంట్ నిధులు మినహాయిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థ్దిక సంఘం ఫండ్స్తోపాటు స్టేట్ ఫైనాన్స్ కింద రాష్ట్రం ఇచ్చే నిధులు సైతం నిలుపుదల చేసింది. దీంతో పంచాయతీల పాలన కష్టతరంగా మారింది. ఈ ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచుల పదవీ కాలం పూర్తి కావడంతో కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ల ఈఎంఐలు, మంచినీటికి బోర్ల ఫ్లెష్షింగ్తోపాటు ఇతర ఖర్చులు కార్యదర్శులే పెట్టాల్సి వస్తుంది.
పల్లె సీమలను పట్టుగొమ్మలుగా మార్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి మనిషికి రూ.187 చొప్పున 15వ ఆర్థ్దిక సంఘం నిధులతోపాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఎస్సీ కాంపోనెంట్ కింద నిధులు ఇచ్చింది. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ పథకాల కింద ప్రతి నెలా రూ.20 కోట్లు విడుదల చేసింది. 2019 సెప్టెంబర్ నుంచి 2023 నవంబర్ వరకు 51 నెలల పాటు రూ.1,020 కోట్లను గత ప్రభుత్వం ఆయా పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. ఆ డబ్బును ట్రాక్టర్ల ఈఎంఐలు, పంచాయతీ కార్మికుల వేతనాలు, నీటి సమస్య పరిష్కారం, ఇతర ఖర్చుల కోసం వినియోగించుకున్నట్లు సర్పంచులు అంటున్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఎస్సీ కాంపోనెంట్ కింద పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.20 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రేవంత్ సర్కార్ ఆ నిధులకు కోత పెట్టింది. డిసెంబర్ 3న కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ అదే నెల నుంచి పల్లె ప్రగతి నిధులు నిలిపివేసింది. ప్రతి నెలా రూ.20 కోట్ల చొప్పున ఈ ఐదు నెలల్లో రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది. కానీ.. అన్నింటికీ కోత పెట్టి ఎస్సీ కాంపోనెంట్ కింద ఈ ఏడాది జనవరిలో రూ.5.69 కోట్లు, మార్చిలో రూ.3.79 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నది.
గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం.. పన్నుల వసూలుపై మాత్రం సీరియస్గా దృష్టి పెట్టింది. నిబంధనలు కఠినతరం చేసి గ్రామాల కార్యదర్శులకు నోటీసులు ఇచ్చి పన్ను వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పన్నులు వసూలు కాని గ్రామాల్లో పాలన భారం కార్యదర్శులపై పడింది. కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ల ఈఎంఐలు పెండింగ్లో ఉన్నప్పటికీ తాగునీటి అవసరాలు, ఇతర అత్యవసర ఖర్చుల కోసం కార్యదర్శులు తమ జేబు నుంచి పెట్టాల్సి వస్తుంది. ఆ డబ్బులు వస్తాయా.. రావా? అనే మీమాంసలో కార్యదర్శులు పడ్డారు.
పల్లె ప్రగతి కింద గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల్లో రూ.9.48 కోట్లు విడుదల చేసింది. జనవరిలో రూ.5.69 కోట్లు, మార్చిలో రూ.3.79 కోట్లు ఎస్సీ కాంపోనెంట్ కింద నిధులు విడుదల చేసింది. గ్రామాల్లో ఆర్థ్దిక అవసరాలు తీర్చడానికి పన్నుల వసూలు చేపట్టాం. ట్రాక్టర్ల ఈఎంఐలు, కార్మికుల వేతనాలు పంచాయతీ నిధుల నుంచే ఇవ్వడం జరుగుతుంది.
– మురళి, జిల్లా పంచాయతీ అధికారి, నల్లగొండ
గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడంతోపాటు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. గ్రామాల్లో చెత్తాచెదారం ఎక్కడికక్కడే పేరుకుపోవడంతో దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన నిధులు గ్రామ పంచాయతీ కరెంట్ బిల్లులు చెల్లించడానికే సరిపోతుంది. ట్రాక్టర్లకు డీజిల్ పోయడానికి కూడా నిధులు లేని పరిస్థితి. గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో వారి కుటుంబ పోషణ భారంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడితే.. కాంగ్రెస్ పాలనలో అధ్వాన్న స్థితికి వెళ్తున్నాయి.
– సుర్వి యాదయ్యగౌడ్, మాజీ సర్పంచ్, అల్లందేవి చెర్వు, సంస్థాన్ నారాయణపురం మండలం