పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తి
ఐదో తరగతిలో ప్రవేశాలకు విశేష స్పందన
ఉమ్మడి జిల్లాలో 6,720 సీట్లకు పరీక్ష రాసిన విద్యార్థులు 27,126
ఒక్కో విద్యార్థికి ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి విద్య
ఒకసారి అడ్మిషన్ పొందితే టెన్త్, ఇంటర్ వరకు..
84 గురుకులాల్లో ఐదు నుంచి ఇంటర్ వరకు 49,760 మంది విద్యార్థులు
బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా భోజన వసతితోపాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలకు విశేష స్పందన లభిస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో అత్యుత్తమ బోధన అందడమే కాకుండా ఇందులో చదివిన విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చుతున్నారు. దాంతో గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించేందుకు
తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు 84 ఉండగా 49,760 మంది చదువుతున్నారు. ఐదో తరగతిలో ప్రవేశం పొందితే పది, ఇంటర్ వరకు చదివే అవకాశం ఉంది. వీటితోపాటు ప్రత్యేకంగా డిగ్రీ గురుకుల కాలేజీలు ఉన్నాయి. దాంతో గురుకులాల్లో అడ్మిషన్లకు పోటీ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఐదో తరగతిలో ప్రవేశాలకు 6,720 సీట్లు అందుబాటులో ఉండగా ఈ ఏడాది 27,126 మంది పరీక్ష రాశారు. సీటు కోసం తల్లిదండ్రులు పిల్లలకు కోచింగ్ కూడా ఇప్పించారు. విద్యతోపాటు భోజనం, వసతి, స్టడీ మెటీరియల్, దుస్తులకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నది. పైసా ఖర్చు లేకుండా ఉత్తమ విద్య అందుతుండడంతో గురుకులాలకు ప్రాధాన్యం పెరిగింది.
నల్లగొండ, జూన్ 26 : తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యాక పేద విద్యార్థులకు కేజీ టూ పీజీ వరకు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. అందుకనుగుణంగా గురుకుల విద్యాలయాలను ప్రారంభించారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన గురుకుల పాఠశాలల్లో పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య, మంచి వసతి కల్పిస్తున్నారు. దీంతో తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. తొలి ఏడాది ఐదో తరగతి నుంచి ఏడో తరగతి వరకు అడ్మిషన్లు స్వీకరించగా.. ఆ తర్వాత ప్రతి ఏటా ఒక్కో తరగతిని అప్గ్రేడ్ చేస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీ, ఎస్సీ, మైనార్టీ, గిరిజన పాఠశాలలు మొత్తం 84 స్థాపించారు. అందులో ఇప్పటి వరకు 64 విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం.. ప్రతి ఏటా ఐదో తరగతిలో ప్రవేశ పరీక్ష ద్వారా కొత్త అడ్మిషన్లు చేపడుతున్నది.
ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య..
పేద వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 84 పాఠశాలల్లో 49,760 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రధానంగా ఐదో తరగతి, ఇంటర్లో ప్రవేశ పరీక్ష ద్వారా పూర్తిగా అడ్మిషన్లు కల్పిస్తున్నారు. మిగిలిన తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్లను ఎంట్రన్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 84 పాఠశాలలకుగాను గత విద్యా సంవత్సరం వరకు 64 విద్యాలయాలు ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ కాగా, వచ్చే ఏడాది అన్ని పాఠశాలలు ఆ స్థాయికి చేరనున్నాయి. పాఠశాల స్థాయిలో 40,320 మంది ఉచిత విద్య పొందుతుండగా.. కళాశాల స్థాయిలో 9,440 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, ఒకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్నారు.
చక్కని భోజనం.. సకల సౌలత్లు
పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలని ఏర్పాటు చేసిన గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడంతోపాటు చక్కని భోజనం, సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీతో విద్యా బోధన, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్టేషనరీ, దుస్తులు, షూ అందిస్తున్నారు. కాస్మొటిక్స్ కోసం ఒక్కో విద్యార్థికి నెలకు రూ.140 ఇస్తున్నారు. మెనూ సంబంధించి ఉదయం జావ, తర్వాత బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందిస్తున్న ప్రభుత్వం.. నెలలో ఒక రోజు మటన్, మూడు రోజులు చికెన్ పెడుతున్నది.
గురుకుల ప్రవేశాలకు పెరిగిన పోటీ..
గురుకుల పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన ఆంగ్ల మాధ్యమంలో విద్య, మెరుగైన వసతి అందుతుండడంతో ప్రవేశాలకు ఏటేటా పోటీ పెరుగుతున్నది. 2016లోనే ఈ గురుకులాలు ప్రారంభించినప్పటికీ రెండు, మూడు సంవత్సరాలు తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. పదో తరగతిలో మంచి ఫలితాలు రావడం, పిల్లలు ఆంగ్లంలో మాట్లాడుతుండటం, ప్రతిభ కనబర్చడం, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల భారంతో తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు 84 ఉండగా, ప్రతి పాఠశాలలో 80 మంది విద్యార్థులకు ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ ఏడాది అర్హత పరీక్ష నిర్వహించారు. మొత్తం 6,720 సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు ఆయా సామాజిక వర్గాల నుంచి 27,126 మంది విద్యార్థులు ఎంట్రన్స్ రాశారు. అందులో మెరిట్ కలిగిన వారిని తొలి విడుతలో అడ్మిషన్లు కల్పిస్తున్నారు.
బ్యాక్లాగ్ సీట్లకు మరింత పోటీ..
గురుకుల పాఠశాలల్లో బ్యాక్లాగ్ సీట్లకు విద్యార్థుల నుంచి మరింత పోటీ నెలకొన్నది. ఐదో తరగతిలో అవకాశం రానివారు, చేరనివారు ఆ పై తరగతుల్లో ప్రవేశం కోసం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం బాగా పోటీ ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో బీసీ గురుకులాలు 26 ఉండగా, వాటిల్లో ఈ ఏడాది 101 బ్యాక్లాగ్ సీట్లు ఉన్నాయి. ఆ సీట్లు పొందేందుకు 7,652 మంది విద్యార్థులు ఎంట్రన్స్ రాశారు. 26 ఎస్సీ గురుకులాల్లో 118 సీట్లు ఖాళీగా ఉండగా.. జూలై 4వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ఎస్టీ, మైనార్టీ పాఠశాలల్లో 22 సీట్లు మాత్రమే ఖాళీగా ఉండగా 3,321 మంది ప్రవేశ పరీక్ష రాశారు. దీన్ని బట్టి చూస్తే గురుకులాలకు ఏ స్థాయిలో పోటీ ఉందో అర్థమవుతున్నది.
గురుకులాల్లో నాణ్యమైన విద్య..
గతంలో పేద విద్యార్థులకు చదువు భారం కావడంతో ఎంతో మంది దళిత, గిరిజన, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలవారు విద్యకు దూరమయ్యారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి అందుతున్నది. మంచి భోజనంతోపాటు వసతి కల్పించి అన్ని సౌకర్యాలు అందిస్తుండడంతో గురుకులాల్లో ప్రవేశాలకు పోటీ పెరుగుతున్నది. పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించుకునే స్థోమత ఉన్నప్పటికీ గురుకుల విద్య బాగున్నందున అందులో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు.
– నారబోయిన స్వరూపారాణి, నల్లగొండ జడ్పీ సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం చైర్మన్