యాదగిరిగుట్ట, ఏప్రిల్ 9 : ‘నీ గర్భాశయం గట్టిపడింది.. కడుపులో గడ్డలున్నాయి.. గర్భాశయం తీసివేయకపోతే క్యాన్సర్గా మారే అవకాశాలున్నాయి.. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ప్రమాదం.. వెంటనే ఆడ్మిట్ కావాలి.. ఆలస్యం చేయవద్దు.. నీవద్ద ఎంత ఉందో అంత డబ్బు కౌంటర్లో కట్టి ఆడ్మిట్ కావాలి.. హైదరాబాద్ నుంచి స్త్రీ వైద్యనిపుణులు వస్తున్నారు.. వెంటనే ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు.. వారం రోజుల్లో తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లవచ్చు’. ఇది ప్రస్తుతం జిల్లాలోని కొన్ని ప్రైవేట్ దవాఖానల్లో జరుగుతున్న తంతు. కడుపునొప్పి వంటి సాధారణ సమస్యలతో వచ్చినా పెద్ద ఆపరేషన్లు చేయాలని చెబుతూ మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
గుట్టచప్పుడు కాకుండా చేపడుతున్న ఈ ఘటనలు జిల్లా వైద్యాధికారుల దృష్టికి రాకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు సంపాదన మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నది. జిల్లాలో ఆపరేషన్లు జరిగే ్రప్రైవేట్ దవాఖానలు 40 ఉండగా, 44 స్కానింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రైవేట్ దవాఖానలు, కొందరు వైద్యులు అవసరం లేకపోయినా మహిళల గర్భసంచి తొలగింపు(హిస్టరెక్టమీ) శస్త్ర చికిత్స చేస్తున్నట్లు సమాచారం.
అసలైతే గర్భాశయాన్ని తొలగించాల్సిన పనిలేదు. కానీ అవసరంలేకున్నా డబ్బుకు కక్కుర్తి పడి చిన్న వయస్సులోనే హిస్టరెక్టమీ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక వెల్లడించింది. మహిళలకు నిర్వహిస్తున్న అనవసర గర్భాశయ శస్త్ర చికిత్సలపై సుప్రీంకోర్టు సైతం గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చికిత్సతో నయం చేయగలిగిన చిన్న సమస్యలకూ గర్భాశయాన్ని తొలగించడం అనేది, మహిళల ప్రాథమిక హక్కు, ముఖ్యంగా ఆర్టికల్ 21 ప్రకారం వారి ఆరోగ్య హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది.
ప్రైవేట్ ఆస్పత్రుల మోసాలు..
ఇటీవల యాదగిరిగుట్ట మండలం, చొల్లేరు గ్రామానికి చెందిన ఓ మహిళ(35 ) స్పల్ప కడుపునొప్పితో భువనగిరిలో ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లింది. అక్కడి స్త్రీ వైద్యనిపుణురాలు పరీక్షించి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలని సూచించింది. అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కు వెళ్లి పరీక్షించుకోగా ‘బల్కీ యూట్రస్’ అని స్కానింగ్ రిపోర్టులో ధృవీకరించారు. ఆ రిపోర్టును చూసిన వెంటనే వైద్యురాలు ఆపరేషన్ చేసిన గర్భసంచీ తీసివేయాలని సూచించింది. అవాక్కయిన ఆమె మళ్లి వస్తానని తాత్కాలికంగా మందులు రాయాలని కోరింది. అనంతరం జిల్లా దవాఖానకు వెళ్లి రిపోర్టు చూపించింది. బల్కీ యూట్రస్ ఉన్నంత మాత్రాన ఆపరేషన్ అవసరం ఉండదు.
గర్భాశయంలో గడ్డలు సంఖ్య పెరిగిపోవడం, భరించలేని కడుపునొప్పి, నెలసరి సమయంతోపాటు విపరీతమైన రక్తస్రావమైతే తప్పనిసరి పరిస్థితులో ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ దవాఖానలు, కొందరు డాక్టర్లు అవసరం లేకపోయినా హిస్టరెక్టమీ చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 104 దవాఖానల్లో కేవలం 40 దవాఖానల్లో మాత్రమే ఆపరేషన్లు జరుగుతాయి. దీంతో పాటు 56 అల్ట్రా స్కానింగ్ సెంటర్లకు గాను 44 సెంటర్లలో మాత్రమే స్కానింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో రోజుకు దాదాపుగా 20 నుంచి 30 శాతం మహిళలు గర్భాశయ సమస్యతోనే వస్తున్నట్లు తెలుస్తోంది.
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఇందులో చాలా స్కానింగ్ సెంటర్లకు ప్రైవేట్ ఆసుపత్రులకు లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని సమాచారం. వీరికి ఒక్కో స్కానింగ్కు వైద్యులకు సుమారుగా రూ. 500 నుంచి 1,000 వరకు కమీషన్ వెళ్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వైద్యురాలు చెప్పిన విధంగానే స్కానింగ్ రిపోర్టింగ్ ఇస్తుంటారన్న చర్చ సాగుతున్నది. దీంతో వారు ఇచ్చిన రిపోర్టును చూసి రోగిని భయభ్రాంతులకు గురి చేసి వారికి ఇష్టం లేకున్నా డబ్బుకు కక్కుర్తిపడి ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిసింది. 32 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో అధిక శాతం అపరేషన్లు జరగడం గమనార్హం.
జిల్లా వైద్యాధికారుల చర్యలు శూన్యం
కేంద్ర ప్రభుత్వం 2022లో అనవసర హిస్టరెక్టమీ నివారణ మార్గదర్శకాలను విడుదల చేసిం ది. దీని ప్రకారం జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిల్లో ప్రత్యేక మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి కేసును పర్యవేక్షించాలని సూచించింది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా వైద్యాధికారులు చేపడుతున్న చర్యలు మాత్రం శూన్యం అప్పుడప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారన్న చర్చ సాగుతున్నది.
అలాగే ఆపరేషన్ సందర్భంగా న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ప్రైవేట్ దవాఖాన యాజమాన్యా లు ముందుగా రోగితో సంతకం చేయించుకుంటారు. అయితే అందులో ఏం రాశారో రోగికి పూర్తి సమాచారం ఇవ్వరు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గర్భాశయ తొలగింపుపై జిల్లా వై ద్యాధికారులు అవగాహన కల్పించే వారు. గర్భాశయం తొలగించాల్సి వస్తే చేపట్టాల్సిన జాగ్రత లు, తప్పనిపరిస్థితుల్లో గర్భాశయాన్ని తొలగించుకోవాలని, అవసరంలేని సమయంలో గర్భాశయం తొలగింపు అవసరంలేదన్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేవారు.
అమలు కాని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
అనవసరమైన హిస్టరెక్టమీ ఆపరేషన్లను అరికట్టేందుకు సుప్రీంకోర్టు 2023 ఏప్రిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2022లో రూపొందించిన జాతీయ మార్గదర్శకాలను అన్ని రాష్ర్టాలు మూడు నెలల్లోపు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. అనైతిక చర్యలకు పాల్పడే డాక్టర్లపై నేషనల్ మెడికల్ కమిషన్, రాష్ట్ర మెడికల్ కౌన్సిళ్లు కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై పెనాల్టీలు విధించాలని సూచించింది. మూడేళ్లవుతున్నా ఈ మార్గదర్శకాలు జిల్లాలో సరిగా అమలు కావడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు హిస్టరెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న మహిళ సంఖ్య జిల్లా వైద్యశాఖ వద్ద సమాచారం లేకపోవడం గమనార్హం. దీనిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ను వివరణ కోరేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.