– పుస్తెలతాడు, 3 బైక్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు
మిర్యాలగూడ, మే 21 : మిర్యాలగూడ మండలంలోని జప్తివీరప్పగూడెం గ్రామంలో వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి సొమ్ము రికవరీ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. జప్తివీరప్పగూడెం గ్రామంలో కిరాణా షాపు నిర్వహిస్తున్న వృద్ధురాలి వద్దకు గడిచిన ఏప్రిల్ 28న నలుగురు వ్యక్తులు వచ్చి మద్యం సేవించి పుస్తెలతాడును గుంజుకుని పారిపోయారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా ఏప్రిల్ 21న చింతపల్లి గ్రామానికి చెందిన గుంపుల సైదులు అనే గీత కార్మికుడు మోటార్ సైకిల్ పై వెళ్లి రోడ్డుపై మోటార్ సైకిల్ను నిలిపి కల్లు గీసేందుకు వెళ్లాడు. ఈ వాహనాన్ని చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చోరీ చేసిన పుస్తెలతాడును అమ్ముకుని డబ్బులు పంచుకుందామని నలుగురు వ్యక్తులు మిర్యాలగూడ పట్టణానికి వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్న వీరిని రూరల్ పోలీసులు పట్టుకుని విచారించగా పుస్తెలతాడు, బైకు చోరీ చేసినట్లుగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సూరోజు భార్గవ చారి, దండగల వినోద్ కుమార్, శివ నాగ మల్లికార్జునరావు, మిట్టగూడెం గ్రామానికి చెందిన పఠాన్ అష్రాఫ్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుండి పుస్తెలతాడు, మూడు మోటారు సైకిల్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నలుగురిని కోర్టులో రిమాండ్ చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ ప్రసాద్, ఎస్ఐ లక్ష్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.