కోదాడ/నేరేడుచర్ల, ఫిబ్రవరి 7 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోదాడలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఆయన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు హుజూర్నగర్ పట్టణంలోని 100 పడకల ఏరియా దవాఖానను మంత్రులు పరిశీలించారు. ఇన్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానిస్తున్నదన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని సూచించారు. 1800 రోగాలకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు పొందవచ్చన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయని, వాటి నుంచి వచ్చే స్పెషల్ డెవలప్ ఫండ్ను వైద్యశాలకు ఖర్చు చేస్తే బాగుంటుందని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ చట్టబద్ధతకు దామోదర రాజనర్సింహ కృషి ఎనలేనిదన్నారు. రెడ్లకుంట ఎత్తిపోతల పథకాలతో వెయ్యి ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఎన్ఆర్జీ కింద రూ.12 కోట్లు, మరో రూ. 10 కోట్లు ఎమ్మెల్యే పద్మావతి ద్వారా మంజూరు అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, డైరెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, జిల్లా అడిషనల్ కలెక్టర్లు ప్రియాంక, వెంకట్రెడ్డి, ఎస్పీ రాహుల్ హెగ్డే, డీఎంహెచ్ఓ వెంకటాచలం, డీసీహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీఎస్పీ ప్రకాశ్, హుజూర్నగర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, నాయకులు ఎర్నేని వెంకటరత్నంబాబు, వంగవీటి రామారావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, హుజూర్నగర్, కోదాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్లు కరణ్కుమార్, దశరథ, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనా రవి, హుజూర్నగర్ ఎంపీపీ గూడెపు శ్రీను, డాక్టర్ జాస్తి సుబ్బారావు పాల్గొన్నారు. తొలుత హుజూనగర్కు హెలికాప్టర్లో వచ్చిన మంత్రులకు అధికారులు, రాజకీయ నాయకులు ఘన స్వాగతం పలికారు.