దామరచర్ల, సెప్టెంబర్ 7: అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో దూసుకు పోతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కల్లేపల్లి గ్రామంలో రూ. 55 లక్షలతో బంగారు మైసమ్మ ఆలయ పునర్నిర్మాణ పనుల భూమిపూజలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి గురువారం ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గుత్తా పాల్గొని మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తన తరఫున సీడీపీ ఎమ్ఎల్సీ నిధుల నుంచి రూ. 25 లక్షలు అందిస్తానన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మిర్యాలగూడ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దామరచర్ల మండలంలో రూ. 30 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న థర్మల్ పవర్ప్లాంట్ మరో నాలుగు నెలల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈప్రాంతంలో భూముల ధరల విలువ పెరిగిందన్నారు. గతంలో ఎకరం రూ.5,10 లక్షలు పలికిన భూములు నేడు కోటి రూపాయలకు పైగా పెరిగిపోయాయన్నారు. మారుమూల తండాల్లో సైతం రూ. 25 లక్షలకు తక్కువ లేదన్నారు. అదే నది దాటి ఆంధ్రాకు పోతే ఐదు లక్షలకు మించి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భాస్కర్రావును మూడోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉందన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందాయన్నారు. తండాలను పంచాయతీలుగా చేయడంతో పాటు కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ఇలాంటి పాలన కొనసాగాలంటే సీఎం కేసీఆర్ను మళ్లీ గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్యదైవమైన బంగారు మైసమ్మ ఆలయ నిర్మాణం పనులు వేగంగా చేపట్టి, భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్ పేదప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటుగా అన్ని మతాల సమానత్వంకోసం పాటుపడుతున్నారన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వేల కోట్లతో యాదాద్రి పవర్ప్లాంట్, ఎత్తిపోతల పథకాలు, రోడ్లు నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు బీఆర్ఎస్ను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. అంతకు ముందు ఆలయ కమిటీ సభ్యులు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వారికి స్వాగతం పలికారు. అనంతరం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామ్చందర్నాయక్, డీసీఎంఎస్ వైస్చైర్మన్ డి. నారాయణరెడ్డి, ఏఎమ్సీ చైర్మన్ బైరం సంపత్, వైస్ చైర్మన్ కె. వీరకోటిరెడ్డి, జడ్పీటీసీ ఆంగోతు లలిత, తాసీల్దార్ జవహర్, వైస్ ఎంపీపీ కె. సైదులురెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు స్కైలాబ్నాయక్, మండల కార్యదర్శి డి. వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు శారద, బాలలక్ష్మి, సోము సైదిరెడ్డి, సర్పంచ్ జనార్దన్, కోటిరెడ్డి, ఎండీ యూసుఫ్, పాచ్యూనాయక్, బాల సత్యనారాయణ, ఈఓ కొండారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.