చౌటుప్పల్, ఏప్రిల్ 18 : యాదాద్రి జిల్లాకు త్వరలోనే మెడికల్ కాలేజ్ రాబోతున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో వంద పడకల ఆసుపత్రికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైద్యం కోసం రూ.1300కోట్ల పనులు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు చౌటుప్పల్లో వంద పడకల దవాఖానను రూ.36కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. 65వ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర సమయాల్లో హైదరాబాద్కు పోకుండా ఇక్కడే మైరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు 100పడకల దవాఖాన నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ దవాఖానలో క్రిటికల్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.
మర్రిగూడకు 30పడకల దవాఖాన మంజూరు చేశామని, నాంపల్లి, మునుగోడు, చండూరు, సంస్థాన్ నారాయణపురం పీహెచ్సీలు 24గంటలు అందుబాటులో ఉండేలా చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చామన్నారు. గత ఏడాది 8 మెడికల్ కాలేజీలు వస్తే.. ఈ సారి 9 ప్రారంభించామని చెప్పారు. గతంలో వైద్య విద్య కోసం రష్యా, ఉక్రెయిన్ వెళ్లేవారని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాల్లో కూడా మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయన్నారు.
తెలంగాణ రాక ముందు సూపర్ స్పెషాలిటీ వైద్యం, విద్య అందని ద్రాక్షగా ఉండేదని పేర్కొన్నారు. 2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు 46కు చేరాయని, ఈ ఏడాది ఇచ్చే 9కాలేజీలను కలుపుకొంటే 55కు చేరుతాయని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఊరూరా పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెలాఖరు వరకు రాష్ట్రమంతటా న్యూట్రిషన్ కిట్లు అందిస్తామని చెప్పారు. గతంలో రాష్ట్రంలో 3డయాలసిస్ కేంద్రాలు ఉంటే.. 102కు పెంచామన్నారు. తంగడపల్లి పీహెచ్సీకి రూ.90లక్షలు మంజూరు చేశామని తెలిపారు. విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.