– బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్
దామరచర్ల, మే 15 : రాష్ట్రంలో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వారికే ఇవ్వాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు గతంలో పనిచేసిన పెండింగ్ బిల్లుల విషయంలో పాత సర్పంచులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. మాజీ సర్పంచులు ఆయా గ్రామ పంచాయతీల్లో సొంత డబ్బులు, అప్పులు చేసి అభివృద్ధి పనులు చేయించగా నిధులు రాకపోవడంతో ఇన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారని, ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయగా పాత పనుల బిల్లులు ఇవ్వకుండా మాజీ సర్పంచులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. కొన్ని గ్రామ పంచాయతీలో బిల్లులకు కమీషన్లు అడుగుతున్నారని, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని పాత పాలకవర్గాలు చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.