సూర్యాసేట టౌన్, ఎప్రిల్ 27 : నాటి ఉద్యమ రథ సారధిగా 14 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదేండ్ల పాలనలో యావత్ దేశానికే రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిపారని, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యాపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన గులాబీ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే సబ్బండ వర్గాల సమాన అభివృద్ధి జరిగిందన్నారు. గత పదేండ్లు ప్రజలంతా అన్ని రంగాల అభివృద్ధితో ఐక్యతను పెంచుకుంటూ సుఖ సంతోషాలతో జీవించారని గుర్తు చేశారు. అంతకు మించి అభివృద్ధి, సంక్షేమాలు అందిస్తామన్న కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని, కానీ అతి తక్కువ సమయంలోనే మోసపోయామని తెలుసుకున్నారని తెలిపారు.
అధికారం చేపట్టిన అతి తక్కువ సమయంలో ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని స్థాపించి, ఎన్నో అభివృద్ధి పనులతో ప్రజల కలను సాకారం చేసిన కేసీఆర్ చరిత్రలో నిలిచి పోతారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, కౌన్సిలర్లు బాషా, తాహేర్ పాషాతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.