జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జోరు మీద ఉన్నది. ప్రతిపక్షాలకు అందనంత దూరంగా దూసుకెళ్తున్నది. మాజీ ఎమ్మెల్యేలు, పోయిన సారి పోటీ చేసిన కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఉద్దండుల పార్టీగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు జిట్టా బాలకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి ఏకతాటిపైకి వచ్చి కారు పార్టీని జెట్ స్పీడ్తో నడిపిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఏకాకిగా మారిపోయింది. సరైన నాయకత్వం లేక కుదేలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు, భువనగిరిలో 50వేల మెజారిటీ లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. నాటి మిత్రులు, శత్రువులు జత కలవడంతో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు, పోటీ చేసిన నేతలంతా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండడంతో గులాబీ దళం తిరుగులేని శక్తిగా మారింది. ఆలేరులో భిక్షమయ్యగౌడ్, కల్లూరి రామచంద్రారెడ్డి.. భువనగిరిలో ఉమామాధవరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి తదితర నేతలంతా కారు పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న లీడర్. ఇటీవలి వరకు బీజేపీ, కాంగ్రెస్లో ఉన్న ఆయన.. ఈ మధ్యే బీఆర్ఎస్లో చేరారు. ఆయన భువనగిరి అసెంబ్లీకి రెండు సార్లు పోటీ చేశారు. 2014లో రెండో స్థానంలో నిలిచారు. 2018లో 13,427 ఓట్లు సంపాదించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో కీ రోల్లో ఉన్న చింతల వెంకటేశ్వర్రెడ్డి భువనగిరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నియోజకవర్గంలో మంచి పట్టున్న ఆయన అంతకుముందు పలు కీలక పదవులు చేపట్టారు. భువనగిరి నియోజకవర్గంలో ఎలిమినేటి ఉమామాధవరెడ్డి కుటుంబానిది ప్రత్యేక స్థానం. దివంగత నేత మాధవరెడ్డి, ఉమామాధవరెడ్డి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం వారి కుమారుడు సందీప్రెడ్డి జడ్పీ చైర్మన్గా కొనసాగుతున్నారు.
ఇక ఆలేరు నియోజకవర్గంలో బీసీల్లో మంచి పేరున్న నేత బూడిద భిక్షమయ్యగౌడ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేశారు. 2018లో 61,784 ఓట్లు సాధించారు. ఆయనకు ఆత్మకూరు, గుండాలతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పట్టుంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కల్లూరి రామచంద్రారెడ్డి 2018కు ముందు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి 11,923 ఓట్లు సాధించారు. బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో ఆయనకు మంచి అనుచర గణం ఉన్నది.
జిల్లాలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ హవాతో ఉద్యమకారులు, తెలంగాణవాదులు కారెక్కుతున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ వరకు గులాబీ కండువా కప్పుకొంటున్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని రాబంధుల పాలు అవ్వకుండా కాపాడుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పనిచేసినోళ్లంతా ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు. దీంతో ఆ పార్టీ సంస్థాగతంగా మరింత బలంగా తయారైంది.
బీఆర్ఎస్లో హేమాహేమీలు చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఏకాకిగా మారింది. ఆ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులు మినహా చెప్పుకోదగిన నేతలు లేరు. ఆలేరులో బీర్ల ఐలయ్యకు ఆ పార్టీ నేతలే సహకరించడంలేదు. బోరెడ్డి అయోధ్యరెడ్డి, బండ్రు శోభారాణి, సంజీవరెడ్డి, కుడుదుల నగేశ్ తదితర నేతలు సైలెంట్గా ఉన్నారు. భువనగిరిలోనూ ఇదే పరిస్థితి. ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు నచ్చక సెకండ్ కేడర్ కూడా బీఆర్ఎస్లో చేరుతున్నది. కుంభం అనిల్కుమార్ రెడ్డి సొంత మండలం వలిగొండలో పలువురు బీసీ నేతలు అలకబూనారు. నియోజకర్గంలో పలువురు నేతలు పైకి ప్రచారంలో పాల్గొంటున్నా.. ఇంటర్నల్గా సహకరించడం లేదని తెలుస్తున్నది.
బీఆర్ఎస్ బలపడటం, కాంగ్రెస్ బలహీనపడటంతో కారు పార్టీ గెలుపు నల్లేరు మీద నడకైంది. గతంలో పోటీ చేసినోళ్లు, ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోనే ఉండి ప్రస్తుతం కారు పార్టీ అభ్యర్థుల కోసం పని చేస్తున్నారు. 2018లో ఆలేరులో పోటీ చేసిన బూడిద భిక్షమయ్య గౌడ్, కల్లూరి రామచంద్రారెడ్డి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వారు పెద్ద ఎత్తున చేరికలు చేస్తున్నారు. భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం రంగంలోకి దిగారు. నాటి మిత్రులు, శత్రువులు జత కలవడంతో బీఆర్ఎస్ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు చోట్లా 50వేలకు పైగా మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు.