యాదగిరిగుట్ట, మే 18 : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం విలేకరులతో ఆమె మాట్లాడారు. ఆలేరు పట్టణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పట్టభద్రుల ఓటర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
5వేలకు పైగా పట్టభద్రులు రానున్న ఈ సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీశ్రెడ్డి హాజరవుతారని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగులను మోసం చేస్తున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లను పట్టుకుని తానే ఉద్యోగాలు ఇచ్చిన్నట్లు డబ్బా రేవంత్ కొడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలిచారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని సీఎం రేవంత్రెడ్డి ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదన్నారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 10,713 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని, ప్రతిఒక్కరూ బీఆర్ఎస్ అభ్యర్థికి అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, నాయకులు మారెడ్డి కొండల్రెడ్డి, పాపట్ల నరహరి, నర్సింహారెడ్డి, శ్రీధర్గౌడ్, వాసు పాల్గొన్నారు.