చౌటుప్పల్ : మట్టి కట్ట ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని, పాత తాసిల్దార్ కార్యాలయం నుంచి వలిగొండ రోడ్డు వరకు పిల్లర్లతో కూడిన వంతెన నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పనులు నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తక్షణమే సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే సంతోష పడుతామని.. దానికోసం చేస్తున్న పైరవీలు ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సుకోసం చేయాలని ఎద్దేవ చేశారు.
మట్టి కట్ట పనులు నిలిపివేసినందుకు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులను తక్షణమే కలవాలని చురకలు వేశారు. లేనియెడల ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేను తిరగనివ్వమని హెచ్చరించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నేషనల్ హైవే విస్తరణ నేపథ్యంలో జరుగుతున్న పనులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, వ్యాపారవర్గాలు, పట్టణ ప్రజలతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సమీపంలో 65వ జాతీయ రహదారిపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మట్టి కట్ట మూలంగా వ్యాపారాలకు, ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. దీనితో పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఎన్ హెచ్ ఎ ఐ పీడి శ్రీనివాసరావును కూడా కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్న అభ్యంతరాలు తమకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేదని చెప్పారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతినిత్యం ఈ సమస్యపై ప్రజలు, వ్యాపార వర్గాలు తమ దృష్టికి తెస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.