భువనగిరి అర్బన్, జనవరి 29 : ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రజా వేదికపై జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవమానపర్చడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వేదికపై వాగ్వాదాలు జరుగడం వల్ల ప్రజా ప్రతినిధులపై జనం నమ్మకం కోల్పోతారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యక్తిగతంగా దూషించడం సరికాదని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీలను, నాయకత్వాన్ని కించపరచడం, దూషించడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏదైనా ఉంటే తమ పార్టీ సమావేశంలో మాట్లాడుకోవాలి తప్ప ఇలా వాఖ్యానించడం సరికాదని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ను 100 అడుగుల లోతులో గోతి తీసి పెడుతా, కొన ఊపిరితో పాతిపెడుతా, కేటీఆర్ కాలిగోటికి సరిపోడనడం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులే అయ్యిందని, అప్పుడే సహనం కోల్పోయి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రతిపక్షంగా నిలబడి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో డిసెంబర్ 9 నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దని, బ్యాంకులకు వెళ్లి రూ.2లక్షలు తీసుకుంటే వెంటనే మాఫీ చేస్తామని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల పొట్టగొట్టారని, ఇప్పటికి 26 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.
రాష్ట్రంలో 33 జిల్లాల్లో జడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్ వారే ఉన్నారని, దౌర్జన్యాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, జడ్పీటీసీ బీరు మల్లయ్య, బీబీనగర్ పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీల ఓంప్రకాశ్గౌడ్, నాయకులు, కార్యాకర్తలు పాల్గొన్నారు.