చండూరు, డిసెంబర్ 24 : ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్యాయి స్రవంతిరెడ్డితో కలిసి చండూరులో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని, హామీలు నెరవేర్చకపోతే నిలదీద్దామని, అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే రూ.572 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 2018లో గెలిచిన రాజగోపాల్రెడ్డి అధికారం లేకపోవడం వల్ల పనులు చేయలేకపోయానని సాకులు చెప్పారని, ఇప్పుడు నియోజకవర్గాన్ని ఏ మేరకు అభివృద్ధి చేస్తాడో చూద్దామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయించాలని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనంతో పని చేయాలని, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, బీఆర్ఎస్ చండూరు, గట్టుప్పల్ మండలాల అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, ఇడెం కైలాసం, పట్టణ అధ్యక్షుడు భూతరాజు దశరథ, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు