నల్లగొండ ప్రతినిధి, మార్చి7 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ మంత్రులు గతంలో డిమాండ్ చేసినట్లుగానే ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టిన బీఆర్ఎస్ నేతలు, రెండోరోజు గురువారం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అప్పటి సీఎం కేసీఆర్ ఎల్ఆర్ఎస్ను ప్రకటించారు. దీనికి అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నేతలు అడ్డుపడ్డారు.
ఎల్ఆర్ఎస్పై కోర్టులో కేసులు వేసి ఆటంకాలు సృష్టించారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని, లేకుంటే తాము అధికారంలోకి వచ్చాక తాము ఎలాంటి రుసుమూ లేకుండా చేస్తామని ప్రజలను మభ్యపెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వంటి నేతలంతా ఉచిత ఎల్ఆర్ఎస్పై నోరు మెదపడం లేదు. దాంతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ మంత్రులు గతంలో చెప్పిన మాదిరిగానే ప్రస్తుతం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తొలిరోజు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టింది.
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు. గురువారం పలుచోట్ల నిరసనలు కొనసాగాయి. కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేశారు. నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి, ఎల్ఆర్ఎస్ను ఉచితంగానే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ హరిచందనకు వినతిపత్రాన్ని అందజేశారు. దేవరకొండలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ ఉచిత ఎల్ఆర్ఎస్ కోసం ఆర్డీఓకు విజ్ఞాపన పత్రం అందజేశారు.
హాలియా ప్రధాన కూడలిలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎల్ఆర్ఎస్ను ఉచితంగాఅమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తాసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. సూర్యాపేటలో గులాబీ శ్రేణులు కదం తొక్కాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా కలెక్టరేట్కు తరలివెళ్లారు. ఎల్ఆర్ఎస్కు ఫీజులు వసూలు చేయకుండా ఉచితంగానే అమలు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్కు వినతిపత్రం అందజేశారు.