నీలగిరి, జూన్ 28 : సీఎం రేవంత్రెడ్డి పర్యటన వల్ల జిల్లాకు ఒరిగింది ఏంటని, దేని కోసం ఆయన వచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నల్లగొండలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో ఆశపడిన నల్లగొండ ప్రజలకు సీఎం మరోసారి మొండిచెయ్యి చూపారని, వందలాదిమంది కార్యకర్తలను నాయకులను నిర్బంధించి, చివరికి మీ పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా అరెస్టు చేయించి ప్రజలకు ఏం మెసేజ్ పంపారన్నారు. మీరిచ్చిన హామీలు నెరవేర్చలేక..స్వేచ్ఛగా సభల్లో పాల్గొనలేని మీరు…పర్యటనలు చేయలేని మీరు.. ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని మీ భయాన్ని ప్రజలకు తెలియజేశారన్నారు. రూ.వందల కోట్లు ఖర్చు చేసి మేము పూర్తిచేసిన మెడికల్ కళాశాల ప్రారంభానికి మొదటిసారి వచ్చారు.. కనీసం ఈసారైనా..కేసీఆర్ మాదిరి మీరు కూడా నల్లగొండకు ప్యాకేజీ ప్రకటిస్తారని ప్రజలెంతో ఆశించారన్నారు. నల్లగొండకు సంబంధం లేని హ్యామ్ రోడ్ల శంకుస్థాపన మంత్రి కోమటిరెడ్డి జిమ్మికు అని విమర్శించారు.
ఎకడ తన మంత్రి పదవి ఊడిపోతుందోనని భయంతో… ఏర్పాటు చేసిన భజన కార్యక్రమన్నారు. రూ.10 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విచ్చలవిడిగా ఖర్చు చేసిన ఈ సభ వల్ల ఎవరికి ఉపయోగం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టార్గెట్ పెట్టి, బలవంతంగా మహిళా సంఘాలను సభకు రప్పించారని, గతంలో మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ను రద్దయిన వెయ్యి రూపాయల నోటు అన్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. హ్యామ్ రోడ్ల పేరుతో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకునేందుకే సీఎం పర్యటన అన్నారు. తమకేదో లాభం జరుగుతుందని జనం ఆశిస్తే మిగిలింది శుష ప్రియాలు. శూన్య హస్తాలన్నారు. మేనిఫెస్టోలోని హామీల అమలుకు నల్లగొండ వేదికగా సీఎం ప్రకటిస్తారని జనం ఎంతో ఆశించారని, తాను బహిరంగ లేఖలో ప్రస్తావించిన అంశాలపై సీఎం స్పందన ఉంటుందని ఆశించామని, ఆ అంశాలను మీరు ప్రస్తావించకపోవడం ప్రజా సమస్యల పట్ల మీ వైఖరిని తెలియజేస్తోందన్నారు. అవినీతిమయమైన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్పై చర్యలు ప్రకటించకపోవడంపై నల్లగొండ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. సీఎం పర్యటన మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి, నల్లగొండ ప్రజలను మరోసారి, అబద్ధపు హామీలతో… మభ్యపెట్టడానికి ఉపయోగపడిందే తప్ప ప్రజలకు దీని వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు మీరిచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమయం కోసం వేచి చూస్తున్నారని మీకు తగిన బుద్ధి చెప్పటం ఖాయమని అన్నారు.