నకిరేకల్, ఫిబ్రవరి 8 : కేంద్రం పరిధి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కాపాడుకునేందుకు ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు తరలిరావాలని, కృష్ణానది జలాలపై ప్రశ్నించే గొంతుక అవుదామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. నకిరేకల్లో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం ఎంతవరకు సమంజసమన్నారు. హామీలు నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
కేఆర్ఎంబీకి కృష్ణానది ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండకు భారీ సంఖ్యలో జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో మండలాలు, గ్రామాల వారీగా సమీక్షలు నిర్వహించి పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలన్నారు. గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్ మాట్లాడుతూ ఢిల్లీ పార్టీలను బొందపెట్టిన చరిత్రలు ప్రాంతీయ పార్టీలకు చాలా ఉన్నాయని, వంద రోజుల్లో అమలు చేస్తామన్న 420 హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే బొంద పెడుతారని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి ఎంపీ స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని గులాబీ శ్రేణులను కోరారు. అనంతరం చలో నల్లగొండ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో జడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, తరాల బలరాం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్రెడ్డి, తక్కెళ్లపల్లి ప్రభాకర్రావు, సిల్వేరు ప్రభాకర్, సందినేని వెంకటేశ్వర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, నాయకులు సోమ యాదగిరి, చల్లా కృష్ణారెడ్డి, నడికుడి ఉమారాణి, నవీన్రావు, ఏడుకొండలు పాల్గొన్నారు.
నార్కట్పల్లి : నల్లగొండలో 13న నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభను విజయవంతం చేసేందుకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలి రావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్రెడ్డి, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, యానాల అశోక్రెడ్డి పాల్గొన్నారు.