చిట్యాల, ఏప్రిల్ 16 : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. చిట్యాలలోని లక్ష్మీ గార్డెన్స్లో బుధవారం ఆ పార్టీ ముఖ్యనాయకులతో సన్నాహక సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలను ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ పదేండ్లు అహర్నిశలు కష్టపడి అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 16 నెలల పాలనలో అన్ని రంగాల్లో అధోగతి పాలు జేసిందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులోనూ విఫలమైందన్నారు. రైతులు, చేనేత కార్మికులు, రిక్షా కార్మికుల ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వం స్వలాభం కోసం ప్రభుత్వ భూముల అమ్మకానికి సిద్ధమైందని విమర్శించారు. పైగా అక్రమ కేసులు, నిర్బంధాలతో బీఆర్ఎస్ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని, ఎవరూ భయపడవద్దని సూచించారు. బీఆర్ఎస్ ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ అని, మనకు పోరాటం కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలు ఎంతగా విసిగెత్తారనేది కాంగ్రెస్ సర్వేల ద్వారానే తేలిపోయిందన్నారు. ప్రజల కోసమే నిరంతరం పాటుపడే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మారెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, నాయకులు కొలను వెంకటేశం, సుంకరి యాదగిరి, రాచకొండ కిష్టయ్య, దేవరపల్లి సత్తిరెడ్డి, మెండె సైదులు, కొలను సతీశ్, ఆగు అశోక్, కోయగూర నర్సింహ, పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.