మిర్యాలగూడ రూరల్, ఫిబ్రవరి 14 : మండలంలోని అవంతీపురం కొండపై శ్రీదేవి, భూదేవీ సమేతంగా వెలిసిన కల్యాణ వేంకటేశ్వరస్వామి శాంతి కళ్యాణం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవీలను పెళ్లి కూతురుగా, వేంకటేశ్వర స్వామిని పెండ్లి కొడుకుగా ఉత్సవ విగ్రహాలను పట్టు వస్ర్తాలతో అలంకరించారు. స్వామి, అమ్మవార్లను పల్లకీలో భక్తులు ప్రత్యేకంగా అలంకరించిన పెండ్లి మంటపానికి తరలించారు. పెండ్లి పీటలపై కూర్చోబెట్టి అర్చకులు రామానుజాచార్యులు, గుంటూరు రాధాకృష్ణమాచార్యులు పెళ్లి తంతును ప్రారంభించారు. దేవాలయ కమిటీ చైర్మన్ శరత్బాబు పట్టు వస్ర్తాలు, తలంబ్రాల బియ్యం సమర్పించారు.
స్వామివారి సన్నిధిలో సుమారు 80మంది దంపతులు కల్యాణ పీటల మీద కూర్చొని కల్యాణంలో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి మిర్యాలగూడ మున్సిపాలిటీ, గూడూరు, అవంతీపురం, బాదలాపురం, సుబ్బరెడ్డిగూడెం, ఆలగడప, రాయినిపాలెం, కొత్తగూడెం, కిష్టాపురం గ్రామాల నుంచి, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, చిల్లేపల్లి, గుడుగుంట్లపాలెం, పాలకవీడు గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు దంపతులు వేంకటేశ్వరస్వామి కల్యాణానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కల్యాణానికి హాజరైన వారిలో చెన్నయ్య , సీఎస్పీ వెంకటగిరి, ఎంపీపీ నూకతల సరళ, జడ్పీటీసీ తిప్పన విజయ సింహారెడ్డి నాయకులు శ్రీనివాస్రెడ్డి, సైదయ్య, ఎంపీటీసీ సుజాత పాల్గొన్నారు.
వసంత పంచమిన సరస్వతీదేవి పుట్టిన రోజు కావడంతో అవంతీపురం సరస్వతీదేవి ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు తమ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. సుమారు 150 మంది పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.