నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 16: కేసీఆర్ది తనది అన్నదమ్ముల అనుబంధం అని, ఉద్యమ సమయంలో అనేకసార్లు ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నానని నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామానికి చెందిన బైరెడ్డి రాంరెడ్డి (బోర్ల రాంరెడ్డి) తెలిపారు. ఉద్యమం నాటి అనుభవాలను ఆయన పంచుకొన్నారు. నా వ్యవసాయ భూమిలో భూగర్భజలాలు అడుగంటడంతో బత్తాయి తోట ఎండిపోయింది. 100కు పైగా బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. దాంతో దాదాపుగా పది కిలోమీటర్ల దాకా పైపులైన్ వేశా. ఈ విషయాన్ని అప్పట్లో పలు హిందీ పత్రికలు ప్రచురించాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ ఢిల్లీలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు నా గురించి తెలుసుకొని పిలిపించుకొన్నారు.
నాపై డాక్యుమెంటరీ తీయించి అప్పటి నుంచి ప్రతి సమావేశం, సభల్లో నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని వివరించారు. ఉద్యమ సమయంలో పదులసార్లు పాదయాత్రలో కేసీఆర్ వెంట పాల్గొన్నా. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఫోన్లు చేయడం, అన్న ఎలా ఉన్నావు? అంటూ సంబోధించేవారు. మా ఊరు చెరువుకు లిఫ్ట్ కోసం సీఎం అయిన తొలి నాళ్లలోనే కేసీఆర్ను కలిసేందుకు వెళ్తే ఆయనే స్వయంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. నాతో కలిసి భోజనం చేశారు. నల్లగొండలో నా కొడుకు కృష్ణారెడ్డి, సాహితీల వివాహానికి హాజరయ్యారు.
సీఎం అయిన నాటి నుంచి ఆరుసార్లు కలిశా. తెలంగాణ రాష్ట్రం తేవడం ఒక ఎత్తయితే.. ఆయనే మనకు సీఎంగా 10 ఏండ్లపాటు పనిచేసి రైతులతోపాటు అన్ని వర్గాలకు అండగా ఉన్నారు. రైతు బంధు, రైతు బీమా, రైతుల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేప్పుడే ఫోన్చేసి రైతుల కోసం గిట్లా గీ పథకాలు తెస్తున్నా ఎలా ఉంటుంది నన్ను అడిగారు. రైతులకు కావాల్సింది నీళ్లు, కరెంట్ ఈ రెండు కేసీఆర్ అందజేశారు. రైతులకు ఇంతకన్నా ఎక్కువ మంచి చేసే వారు రాలేరు. ఆయన జన్మదినం రైతులకు ఓ పండుగే. ఆయన చేసిన పాలన రైతుల యాదిలోంచి పోలే.. ఆయన ఆయురారాగ్యాలతో ఉండి రైతులకు అండగా నిలువాలని మా ఆకాంక్ష.