బొడ్రాయిబజార్, మార్చి 16 : దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు తప్పవని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శనివారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ జరుగాలని, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ సాధనకై మాదిగలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
కులాల జనాభా ప్రకారం సంక్షేమ పథకాలు అందించాలని, అందుకు జనాభా లెక్కలు చేపట్టి దాని ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చేవెళ్ల సభలో సీఎం రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నాడని, చేయాల్సిన బాధ్యత ఆయనదేనన్నారు. దేశంలో 10 శాతం మంది జనాభాకు ఉపయోగపడే పార్టీ బీజేపీ అందుకే ఈబీసీ రిజర్వేషన్ చట్టం చేసినట్లు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని మోదీ హైదరాబాద్లో పెద్ద సభ పెట్టి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు కమిటీ వేస్తామని చెప్పి నేటికీ వేయలేదన్నారు. మాదిగలను అడ్డం పెట్టుకుని ఓట్లు కొల్లగొట్టడమే బీజేపీ పని అని, బీజేపీకి ఓటేస్తే కత్తి ఇచ్చి దాడి చేయమని చెప్పడమే అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు, జర్నలిస్ట్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఎడ్వర్డ్, జెఫానియా, బెజవాడ శ్రావణ్, రామ్సైదులు, ఈదయ్య, న్యాయవాది మామిడి మల్లయ్య, బచ్చలకూరి జానయ్య, కడప ఇసాక్, కొండమీది వెంకన్న, బొజ్జ సంజయ్ పాల్గొన్నారు.