సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : డయాబెటిస్… ఇది తియ్యగా రోగి ప్రాణాలను తోడేస్తుంది. శరీరంలోని ప్రతి అవయవంపై ప్రభావం చూపే ఈ షుగర్ వ్యాధి ఎక్కువగా కాళ్లను కాటేస్తుంది. చిన్న పుండుతో మొదలై కాలినే తొలగించాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది. సకాలంలో సరైన చికిత్స అందక ఎంతో మంది డయాబెటిక్ రోగులు కాళ్లు పోగొట్టుకుని అవిటివాళ్లుగా మారుతున్న ఉదంతాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు 10 నెలల క్రితం ఉస్మానియా దవాఖానలో ‘డయాబెటిక్ ఫూట్ కేర్ క్లినిక్’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ర్టాల్లోని ప్రభుత్వ రంగ దవాఖానల్లో ఇదే తొలి క్లినిక్.
సాధారణంగా డయాబెటిక్ రోగులకు కిడ్నీ, ఆర్థో, న్యూరో, కార్డియో సమస్యలు ఎదురవుతాయి. సమస్య తీవ్రత ఆధారంగా వారికి చికిత్స అందించాల్సి ఉంటుంది. కొంత మందికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది. అలాంటి వారికి మల్టిపుల్ వైద్యుల సేవలు అవసరం. మొన్నటి వరకు ఈ రోగులు అవసరమైన వైద్య పరీక్షలు, సేవల కోసం రోజుల తరబడి ఒక్కో విభాగానికి తిరుగాల్సి వచ్చేది. ఈ క్రమంలో చికిత్సకు తీవ్ర జాప్యం జరిగి మొదటికే మోసం ఏర్పడేది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉస్మానియా వైద్యులు రోగికి అవసరమైన 8 ప్రధాన విభాగాల వైద్య సేవలను సింగిల్ విండో ద్వారా ఈ డయాబెటిక్ ఫూట్ క్లినిక్లోనే అందుబాటులోకి తీసుకువచ్చారు.
డయాబెటిక్ ఫూట్ క్లినిక్కు ప్రతి రోజు 20 నుంచి 30 మంది బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఎండోక్రనాలజీ విభాగానికి ప్రతి రోజు 250 నుంచి 300 మంది డయాబెటిక్ రోగులు వస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది పాదంలో స్పర్శ లేక న్యూరోపతి సమస్యతో బాధపడుతున్నవారే. వారిని ఫూట్ క్లినిక్కు పంపించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నాం.
– డాక్టర్ రాకేశ్ సాహే, ఎండోక్రనాలజీ విభాగాధిపతి, ఉస్మానియా హాస్పిటల్
డయాబెటిక్ ఫూట్ క్లినిక్కు వచ్చిన రోగులకు అవసరమైన న్యూరోపతి, డాప్లర్ స్టడీ తదితర అన్ని రకాల పరీక్షలను క్లినిక్లోనే నిర్వహించి అప్పటికప్పుడే నివేదికలను జారీ చేస్తున్నాం. దీంతో అదే రోజు రోగులు వైద్యులను సంప్రదిస్తున్నారు. ఫలితంగా ఒకే రోజులో రోగులకు వైద్యపరీక్షలు, చికిత్స అందడంతో వ్యాధి తీవ్రత పెరుగకుండా ఉంటుంది.
– డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా హాస్పిటల్