తిరుమలగిరి, ఏప్రిల్ 10 : రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ క్రమంలో సర్కారు అందిస్తున్న సాయంతో మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 2016లో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రవేశపెట్టగా.. ఇప్పటి వరకు 8 విడుతలు అందించింది. దీంతో ప్రతి ఏటా 520 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుండగా.. కోట్లల్లో ఆదాయాన్ని పొందుతూ మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు.
8 విడుతల్లో చేప పిల్లల పంపిణీ
సూర్యాపేట జిల్లాలో 848 చెరువులు ఉండగా.. 578 చెరువుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలు వదిలింది. మొత్తం 8 విడుతల్లో 243.81 లక్షల చేప పిల్లలను ఆయా చెరువులు, కుంటల్లో వదిలారు. దాంతో జిల్లాలో ఉన్న 140కి పైగా మత్స్య సహకార సంఘాల్లోని 15,847 మంది మత్య్సకారులు జీవనోపాధి పొందుతున్నారు. దీంతోపాటు మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. 18 నుంచి 70 ఏండ్లలోపు వయసున్న మత్స్యకార్మికులు చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, ప్రమాదానికి గురైతే రూ.25వేలు ఇన్సూరెన్స్ అందుతున్నది.
సబ్సిడీపై వాహనాలు..
మత్స్యకార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నది. ఉచితంగా చేప పిల్లల పంపిణీతోపాటు చేపల రవాణాకు, ఇతర ప్రాంతాల్లో అమ్ముకోవడానికి వీలుగా 70 శాతం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, లగేజ్ ఆటోలు, మినీ డీసీఎంలు అందిస్తున్నది. అదేవిధంగా చేపల వేటకు అవసరమైన పరికరాలను సైతం ఇస్తున్నది. దీంతో మత్స్యకారులు చేపలను విక్రయించుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నారు.
ఇతర రాష్ర్టాలకు చేపల ఎగుమతి
తెలంగాణ రాష్ట్రంలో ఏటా 520 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతున్నది. మార్కెట్లో మన చేపలకు మంచి డిమాండ్ ఉండడంతో ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసుకుంటూ మత్స్యకారులు మంచి లాభాలు గడిస్తున్నారు. ప్రధానంగా కొర్రమీను, రవ్వ, బంగారుతీగ, బురకలు మార్కెట్లో ఎక్కువగా లభిస్తున్నాయి.
చేపల కోసం ఆంధ్రాకు పోయే బాధ తప్పింది
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు పోయి చేప పిల్లలు తెచ్చుకునేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో మాకు ప్రతి సంవత్సరం లక్షకు పైగా చేప పిల్లలు ఇస్తున్నరు. దాంతో ఆంధ్రాకు పోయే బాధ తప్పింది. చేపలు అమ్ముకోవడానికి మాకు ప్రభుత్వం ఒక బొలేరో, ఒక టాటా ఏస్ వాహనం, 18 టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాలు ఇచ్చింది. మేము పట్టిన చేపలను ఆ వాహనాలపై తిరిగి అమ్ముకుంటున్నాం. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.20వేల వరకు సంపాదిస్తున్నా. మత్స్య సంపద పెరుగడంతో హైదరాబాద్ చేపల మార్కెట్కు కూడా ఎగుమతి చేస్తున్నాం. జీవనోపాధి పొందడమే కాకుండా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం.
– అంకిరెడ్డి లింగయ్య, మత్స్య సొసైటీ చైర్మన్, పర్సాయపల్లి, అర్వపల్లి మండలం
చేప పిల్లల పంపిణీతో ఉపాధి పొందుతున్నాం
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండటంతో మేము ఉపాధి పొందడంతోపాటు ఆర్థికంగా ఎదుగుతున్నాం. దీనికితోడు సబ్సిడీపై వాహనాలు అందించడంతో ఏ ప్రాంతానికైనా వెళ్లి మంచి ధరకు చేపలను అమ్ముకుంటున్నాం. దాంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం.
– కుంభం కర్ణాకర్, మత్స్యకారుడు, నాగారం