నల్లగొండ, ఏప్రిల్ 3 : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) మొదటి రాండమైజేషన్ కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. లోకసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల రాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పా టు చేసిన ఈవీఎంల గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి ఈవీఎంలను పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచందర్, ఈవీఎంల నోడల్ ఆఫీసర్ పులిచింతల స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఆరు నియోజకవర్గాల ఏఆర్వోలు, బీజేపీ అధికార ప్రతినిధి లింగస్వామి, కాంగ్రెస్ ప్రతినిధి జూలకంటి సైదిరెడ్డి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బక పిచ్చయ్య, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి చాంద్పాషా, ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రటరీ యారా శ్రీను పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట, ఏప్రిల్ 3 : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ బీఎస్ లతతో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో బ్యాలెట్ యూనిట్లు 1500, సీయూలు 1500, వీవీ ప్యాట్స్ 1680తో కలిపి మొత్తం 4680 ఓటింగ్ యంత్రాలు ఉన్నాయన్నారు. వాటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ చేసినట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్స్ కోసం ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 85 సంవత్సరాలు పైబడిన వారు, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారికి ఇంటి వద్దనే ఓటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ అప్పారావు, డీఎఫ్ఓ సతీశ్కుమార్, డీఆర్డీఓ మదుసూదన్రాజు, ఆర్డీఓలు వేణు మాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.