యాదగిరిగుట్ట, జనవరి 27 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట ఆలయంలో అధ్యయనోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. ముందుగా అర్చకులు స్వామి, అమ్మవార్లను అలంకరించి నిత్యారాధనలు చేపట్టారు. అనంతరం పాంచరాత్రాగమ సంప్రదాయ రీతిలో ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకులు, వేద పండితులు తిరుమంజన మహోత్సవం నిర్వహించారు.
తిరుమంజన మహోత్సవ ప్రత్యేకత
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధమైన పాతగుట్ట ఆలయ అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో మూలవర్యులకు ఆగమశాస్ర్తానుసారం తిరుమంజన మహోత్సవం నిర్వహిస్తారు. భగవత్ రామానుజుల వారు ఈ వేడుక నిర్వహణలో ప్రత్యేకతను సూచిస్తూ భగవానుడి భక్త పారాయణతను, ఆర్తట్రాణ రక్షణను పలు విధాలుగా ప్రస్తుతిస్తారు. తిరుమంజన మహోత్సవాన్ని ఆళ్వారులకు, భగవానుడికి, ఉత్సవ మూలవర్యులకు స్నపనం నిర్వహిస్తారు. ఈ వేడుక స్వామి వారికి పరమ ప్రీతికరమైనదని దివ్యదేశికవైభవ ప్రకాశికలో పేర్కొన్నారు.
వైభవంగా నిత్యోత్సవాలు
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. నిజరూప దర్శనంలో స్వయంభువులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాలు ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. అనంతరం స్వామివారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు.
వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 30,75,134 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రీవారిని డీసీపీ నారాయణరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ డీఈఓ దోర్బల భాస్కర్శర్మ స్వామివారి ప్రసాదం అందించారు.
నేడు గుట్టలో రథసప్తమి వేడుకలు
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో రథసప్తమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. ప్రధానాలయ పునః ప్రారంభం అనంతరం తొలిసారిగా నిర్వహించే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు. ప్రభాత వేళ స్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం వేళలో స్వర్ణ రథంలో స్వామివారికి పురప్పాట్ సేవ నిర్వహిస్తామని తెలిపారు. స్వామి వారిని ప్రత్యేకంగా ఊరేగించేందుకు వినియోగించే సూర్యప్రభ వాహనాన్ని అలయాధికారులు మెరుగులు దిద్దారు. ప్రత్యేకమైన రంగులు దిద్ది సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రథ సప్తమి రోజున స్వామివారి దివ్య మనోహరంగా ముస్తాబు చేసిన వాహనంపై వేంచేపు చేసి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించనున్నారు.