వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొనుగోలు సమయంలో అప్రమత్తంగా లేకపోతే కొందరు వ్యాపారులు నాణ్యతలేని విత్తనాలు అంటగట్టే ప్రమాదం ఉంది. విత్తనాల స్థితిగతులను గమనించక పోవడం వల్లే రైతులు నష్టాలబారిన పడుతున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, వేరుశనగ, మొక్కజొన్న విత్తనాల విషయంలో రైతులు అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.
– యాదగిరిగుట్ట, మే 21
తక్కువ ధర చూసి మోసపోవద్దు
జూన్ మొదటి వారంలో వర్షాలు పడగానే సాగు పనుల హడావిడి మొదలవుతుంది. ఈ సమయంలో ఫర్టిలైజర్ షాపుల వారితోపాటు అనుమతి లేకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి నుంచి రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు తక్కువ ధరకు నాణ్యత లేని విత్తనాలను అంటగడుతుంటారు. ధర తక్కువని కొనుగోలు చేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి అసలు కొనకూడదు. దుకాణాలు, గ్రామాల్లో నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రభుత్వం సర్టిఫై చేసిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తనాలు కొనుగోలు చేసిన అనంతరం దుకాణదారుడి నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. విత్తనాలు ఏ సంస్థకు చెందినవో ప్యాకెట్పై ఉన్న లేబుల్ నంబర్, లాట్ నంబర్ను రసీదుపై నమోదు చేసుకోవాలి. ముందస్తుగా విత్తనాలు మొలకెత్తే శాతాన్ని ఇంటి వద్ద పరిశీలించి ఆ తర్వాతే పొలంలో విత్తుకోవాలి. విత్తిన తర్వాత కూడా విత్తన ప్యాకెట్లను, రసీదులను భద్రపరుచుకోవాలి.
నకిలీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు
నకలీ విత్తనాల విక్రయాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు, వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, పోలీస్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయడంతోపాటు రైతులను అప్రమత్తం చేస్తున్నారు.
రసీదు తప్పక తీసుకోవాలి
విత్తనాల ఎంపికపై రైతులు అవగాహన పెంచుకోవాలి. కొనుగోలు చేసిన ప్యాకెట్లలో ఉన్న విత్తనాలు ఎంత శాతం మొలకెత్తాయో ముందుగానే చూసుకోవాలి. రసీదు తప్పక తీసుకొని దానిని భద్రపరుచుకోవాలి. ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనాలి. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే సమాచారం అందించాలి.
– రాజేశ్కుమార్, మండల వ్యవసాయాధికారి, యాదగిరిగుట్ట