ఆత్మకూర్.ఎస్, ఫిబ్రవరి 20: వరి పంటను కాపాడుకునేందుకు నీళ్ల కోసం రైతులకు రోడ్డెక్కారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వారబందీ పద్ధతిలో నీళ్లిస్తామని చెప్పిన పాలకులు విఫలమవడంతో వారం వారం ఆందోళనకు దిగాల్సిన దుస్థితి దాపురించింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని కోటినాయక్తండా వద్ద ఎస్సారెస్పీ కాల్వ బ్రిడ్జిపై పెన్పహాడ్ మండలానికి చెందిన రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వారబందీ పద్ధతిలో ఈ నెల 16న గోదావరి జలాలు విడుదల చేసిన అధికారులు ప్రధాన కాల్వకు నీటిని అందించకపోవడంతో పెన్పహాడ్ మండలంలో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోటినాయక్ తండా వద్ద ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ డీబీఎం 71 ద్వారా పెన్పహాడ్ మండలానికి నీరు రావాల్సి ఉండగా, ప్రధాన కాల్వకు నీళ్లు అందించకుండా 36ఎల్ కాల్వ ద్వారా మోతె మండలానికి తరలిస్తున్నారని మండిపడ్డారు.
పాలకులు, అధికారులు నీటి సరఫరాలో పక్షపాతం వహిస్తున్నారని మండిపడ్డారు. నీటిని విడుదల చేసిన సమయంలోనూ గేట్ల వద్ద సిబ్బందిని పెట్టకపోవడంతో రాత్రిళ్లు గుర్తు తెలియని వ్యక్తులు మెయిన్ కాల్వ గేట్లు మూసేసి నీటిని మళ్లిస్తున్నారని వాపోయారు. పది రోజుల క్రితం ఏకంగా ప్రధాన కాల్వ గేట్లకు వెల్డింగ్ చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కలెక్టర్ రావాలి.. ఇరిగేషన్ ఏఈఈ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఇరిగేషన్ డీఈ రమేశ్ అక్కడికి చేరుకుని నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం ప్రధాన కాల్వ గేట్లను ఎత్తడంతో మెయిన్ కెనాల్ నుంచి నీటి సరఫరా ప్రారంభమైంది. రైతులు గంటపాటు రాస్తారోకో చేయడంతో సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.