పాలకవీడు, ఫిబ్రవరి 11 : మండలంలోని పలు గ్రామాల్లో యాసంగిలో సాగు చేసిన వరిపై రైతులు ఆశలు వదిలేసుకుంటున్నారు. వానకాలంలో సన్న రకం వరి ధాన్యం క్వింటాల్ రూ.2,600 నుంచి రూ.3,200 పలుకడంతో రైతులు ఆశతో యాసంగిలో పెద్ద మొత్తంలో వరిసాగు వేశారు. నాట్లు వేసే సమయంలో కొంత నీటి లభ్యత ఉండడంతో సమస్య రాలేదు. ప్రస్తుతం పంటలు పొట్ట దశకు వచ్చే సరికి భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. పంటను కాపాడుకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు.
తమకున్న పంట పొలాల్లో నీటి లభ్యతను పెంచుకోవడం కోసం విరివిగా బోర్లు వేస్తున్నారు. బావుల్లో పూడికలు తీస్తున్నారు. కానీ గంగమ్మ కానరాకపోవడంతో బావురుమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో వరుసగా 18 సార్లు సాగర్ ఆయకట్టుకు నీరు వదలడంతో రైతులు చీకూ చింత లేకుండా వ్యవసాయం చేసుకున్నారు. సాగర్ నుంచి నీళ్లు రాక, ప్రస్తుతం కరువు పరిస్థితులు ఏర్పడడంతో తమ పంటలు చేతికి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో గత వానకాలంలో 4.37 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. యాసంగిలో లక్ష ఎకరాల్లో వరిసాగు తగ్గింది. వానకాలంలో పాలకవీడు మండలంలో 17,251 ఎకరాల్లో వరి వేయగా యాసంగిలో 11 వేల ఎకరాలకు పడిపోయింది.
ప్రభుత్వం సాగర్ ఆయకట్టుకు అనధికారికంగా నీటిని విడుదల చేసినా పాలకవీడు మండలంలో పలు గ్రామాల కాల్వలకు నీరు చేరలేదు. కాల్వలు అధ్వానంగా ఉండడంతో నీళ్లు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాలకవీడు మండలంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. బోర్లు 60 నుంచి 300 అడుగుల వరకు వేసినా నీటి లభ్యత లభించడం లేదని రైతులు అభిప్రాపడుతున్నారు. మండలంలో కోమటికుంట, జాన్పహాడ్, గుండ్లపహాడ్ గ్రామాల్లో చెరువులు ఇప్పటికే ఎండిపోయాయి. దాంతో ఆయా గ్రామాల్లో తాగునీటికే దిక్కు లేదని, ఇంకా సాగు ఎక్కడిదని రైతులు వేసిన పంటలను పశువులకు మేతకు వదిలేస్తున్నారు.