సూర్యాపేట, డిసెంబర్ 23
(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు మహా ధర్నా దద్దరిల్లింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణపై వివక్ష చూపుతున్న మోదీ సర్కారుపై రైతన్నలు కన్నెర్ర చేశారు. ఉపాధి హామీ పథకంలో నిర్మించిన పంట కల్లాలపై కక్షపూరితంగా వ్యవహరించడంపై మండిపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి, రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని మోదీ ప్రభుత్వానికి ఎంత కండ్ల మంట ఉందో అర్థమవుతుందని ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. కేంద్రం, బీజేపీ నేతల కుట్రలను ఖండిస్తూ నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగేంధర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు రజాక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ప్రసంగించి కేంద్ర వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
బ్రిటీష్ పాలనను తలపిస్తున్న మోదీ సర్కార్
వ్యాపారాల కోసం ఎన్నో ఏండ్లు దేశాన్ని పాలించిన బ్రిటీష్ వాళ్లను తలపించేలా నేడు దేశంలో బీజేపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. స్వాతంత్య్ర భారతావనిలో ప్రశాంత వాతావరణంలో ఐక్యతతో ఉన్న ప్రజల్లో మళ్లీ మత కల్లోలాలు సృష్టిస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. దేశంలోని అన్ని రంగాలను వరుసగా దెబ్బతీస్తూ ఇప్పుడు రైతాంగం వెంటపడ్డారు. తెలంగాణ మాదిరి నిరంతర అభివృద్ధి పాలన యావత్ దేశంలో కొనసాగించేందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారు తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదు.
ఇక తెలంగాణ మాదిరి పాలనకు యావత్ దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు ఎదురు చూస్తున్నారనే విషయం మోదీకి తెలుసని.. దాంతో ఆయన ఆ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే తెలంగాణపై విషం కక్కుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరోవైపు తెలంగాణ ప్రజానీకాన్ని, రైతాంగాన్ని సైతం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని రంగాల ప్రజలతోపాటు రైతులే ఏకమై బీజేపీని గద్దె దించడంలో ముందుంటారు.
-బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ ఎమ్మెల్యే
రైతులను కేసీఆర్ ఆదుకుంటుంటే.. మోదీ ఆడుకుంటున్నాడు
బీజేపీ పాలనలో దేశం అంబానీ, అదానీలే వ్యాపార వేత్తలు.. మోదీ, అమిత్షాలే నేతలు అన్నరీతిలో కేంద్రం పాలన సాగిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతోపాటు అదానీ, అంబానీలకు దోచి పెడుతూ రాజకీయాలను భ్రస్టుపట్టిస్తున్నారు. ప్రశ్నిస్తున్న రాష్ర్టాలపై వివక్ష చూపుతూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని నమ్ముతున్నారు.
తెలంగాణ లాంటి అభివృద్ధి యావత్ దేశంలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ సాధించి అతితక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్తో దేశ రూపురేఖలు మారుస్తాడనే నమ్మకం పెంచుకుని ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ జోడో యాత్రకే పరిమితమై రాష్ట్రంలో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. ఎమినిదేండ్లుగా దేశంలో బీజేపీ రాక్షస రాజకీయాలతో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతులను వదలకుండా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలుగా కొండంత అండగా నిలిచి ఆదుకుంటుంటే, మోదీ మాత్రం వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. రైతుల పాపం మోదీకి తప్పకుండా తగిలి వచ్చే ఎన్నికల్లో బీజేపీ కనుమరుగు కావడం ఖాయం.
– శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే
తెలంగాణపై మొదటి నుంచి మోదీ వివక్ష
చావునోట్లో తల పెట్టి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అనతి కాలంలోనే అన్ని రంగాలను అభివృద్ధి చేయడం తట్టుకోలేక ప్రధాని మోదీ మొదటి నుంచి విషం కక్కుతున్నాడు. ఎన్నో ఏండ్లుగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో సైతం తెలంగాణ తరహా అభివృద్ధి పథకాలు అందించలేకపోతున్నానన్న అక్కసుతో కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నాడు. అన్ని రంగాల అభివృద్ధితోపాటు రైతును రాజుగా మార్చేందుకు సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు నిరంతర విద్యుత్, పుష్కలంగా కృష్ణా, గోదావరి జలాలు అందిస్తున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా సాగుతుంటే మోదీ సర్కారు ఓర్వలేకపోతున్నది. అభివృద్ధిని అడ్డుకోవడంతోపాటు రైతాంగంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. సముద్ర తీర రాష్ర్టాల్లో చేపలు ఆరబోసుకునేందుకు ఉపాధి హామీ పథకం కింద సిమెంట్ కల్లాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వొచ్చు, కానీ రైతులు పండించిన వడ్లు ఆరబోసుకోవడానికి నిర్మించిన కల్లాలపై కక్ష కడతారా? తెలంగాణలో ఉపాధి హామీ పథకం పనులపైనా వివక్ష చూపుతున్న కేంద్రానికి రైతులు కుర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం.
– బడుగుల లింయ్య యాదవ్, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ
మోదీ సర్కారుకు తగులుతున్న రెండు బుల్లెట్లు
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రైతుబంధు, దళితబంధు పథకాలు రెండు బుల్లెట్లులాగా దేశంలో బీజేపీ అధికారం ఉన్న రాష్ర్టాల్లో తగులుతున్నాయి. అక్కడి ప్రజలంతా తెలంగాణ వంటి పథకాలు తమ రాష్ర్టాల్లో ఎందుకు పెడుతలేరని ప్రశ్నిస్తుండటంతో ఆ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ మాదిరి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేక మన రాష్ట్రంపై విషం కక్కుతున్నారు. అభివృద్ధిని ఓర్వలేక వ్యక్తిగతంగా, పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ఇబ్బందులకు గురిచేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పపడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకత్వాన్ని చూసి తట్టుకోలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు అధికారికంగా రావాల్సిన వాటా ప్రకారం కేంద్రం నుంచి నిధులు ఇవ్వక పోగా రాష్ర్టానికి రుణాలు ఇవ్వకూడదని బ్యాంకులకు చెప్పి విషబుద్ధిని చూపుతున్నారు. అలాంటి బీజేపీని ఇక్కడి ప్రజలు ఆదరిస్తారనుకోవడం సిగ్గుచేటు. అసలు కేంద్రం తెలంగాణ రైతులు, ప్రజలను ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే ఇక్కడి బీజేపీ నాయకులు ఏ మొఖం పెట్టుకుని జనంలో తిరుగుతారు. రైతుల ఉసురు ఊరికే పోదు, బీజేపీకి తగినబుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
– గాదరి కిశోర్ కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే