కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో గత రెండు సీజన్లలో ప్రతిసారీ దాదాపు 80 వేల నుంచి లక్షకుపై ఎకరాల్లో వరి ఎండిపోగా ఈ వానాకాలం సీజన్కైనా కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వచ్చేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేనా? అని రైతులు అనుమానంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రైతులు వరినాట్లకు దుక్కులు దున్ని సిద్ధం చేశారు. మరో పదిహేను రోజుల్లో వరినాట్లకు అదును దాటి పోనుంది. జిల్లాలోని గోదావరి జలాల ఆయకట్టులో దాదాపు 80 శాతం చెరువులు ఖాళీగా దర్శనిమిస్తుండగా కనుచూపు మేరలో నీళ్లు వస్తాయనే ఆశలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం జలాలతో కళకళలాడిన సూర్యాపేట జిల్లా నేడు కాంగ్రెస్ నిర్వాకంతో కరాళనృత్యం దర్శనమిస్తోంది.
– సూర్యాపేట, జూలై 13 (నమస్తే తెలంగాణ)
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలతో పాటు రైతన్న బలపడ్డాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచుకోని పంట భూములను సస్యశ్యామలం చేశారు. ప్రధానంగా సూర్యాపేట జిల్లా పరిధిలోని 2.95 లక్షల ఎకరాల శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో పీడకల కాగా… కాళేశ్వరం జలాలు రావడంతో తలెత్తుకొని ధైర్యంగా సంతోషంగా జీవనం సాగించారు రైతులు. సుమారు 20 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా తొలి యాసంగికి గోదావరి జలాలు రాకపోవడంతో వరి పంట ఎండి పోయింది. తదనంతరం 2024 వానాకాలం, యాసంగిలో పంటలు ఎండడం ప్రభుత్వంపై రైతన్నలు ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలు పునరావృతమయ్యాయి.
ఈ వానాకాలం ప్రశ్నార్థకమే..
ఈ వానాకాలానికి శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు పరిధిలోని సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాలు ఇచ్చేందుకు ఇప్పటి వరకు షెడ్యూల్ ఖరారు కాకపోవడం పట్ల రైతులు అయోమయంలో ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వానాకాలానికైనా.. యాసంగికైనా కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను నిరంతరాయంగా విడుదల చేసి దాదాపు మూడు నెలలు అంటే దాదాపు 85 నుంచి వంద రోజుల పాటు సీజన్కు 30 నుంచి 40 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేసి జిల్లాలోని 2.95 లక్షల ఎకరాల్లో వరి పంట పండింది. ఇటీవల రైతన్నలు యాసంగి పూర్తి చేసుకొని వానాకాలం కోసం దుక్కులు సిద్ధం చేసుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వందలాది పిల్లర్లలో ఒకటి రెండు పిల్లర్లు కొద్దిమేర కుంగడంతో మరమ్మతులు చేయడం మాని రాజకీయం చేస్తూ ప్రాజెక్టును గాలికి వదిలేశారు.
వానాకాలంలో రిజర్వాయర్లు, చెరువులన్నీ ఖాళీ..
ఓ పక్క వర్షాలు రాక భూగర్బజలాలు అడుగుంటి పోతుండగా గత మూడు సీజన్లలో కాళేశ్వరం ఆయకట్టు పరిధిలోని జిల్లాలోని పంట చేతికి రాలేదు. ఈ సారి కూడా వానాకాలం సీజన్ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. జిల్లాలోని శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో 670 వీటిలో 400లకు పైనే చెరువుల్లో నీటి నిల్వలు 25 శాతం మాత్రమే అంటే అడుగంటి పోయినట్లే. మిగిలిన చెరువుల్లో 50 శాతం వరకు నీళ్లు ఉన్నాయంటే వానాకాల సాగు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మరో పక్క కాళేశ్వరం నుంచి నీళ్లు రావాలంటే ఎస్ఆర్ఎస్పీ నుంచి రావాలి. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలో 50 టీఎంసీలకు మించి నీళ్లు లేనట్లు తెలుస్తోంది. దాని దిగువన ఉన్న ఎల్ఎండీలో 30 శాతం ఉండగా మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, బయ్యన్నవాగులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ లెక్కన ఈ వానాకాలం సీజన్కు సంబంధించి సాగునీరు వస్తుందా..? లేదా అనేది అనుమానాస్పదంగా మారింది. వానాకాలం సాగుపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమీక్ష చేసి నీళ్లిస్తామనే హామీతో వరి పంట వేయించడం లేదా పంటల మార్పిడిపై రైతులను ప్రిపేర్ చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైతులు మాత్రం మాయదారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాకు దరిద్రం పట్టుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైతే రిజర్వాయర్లు ఖాళీ
ఈ వానాకాలానికి సంబంధించి ఇప్పటి వరకైతే నీటి విషయంలో ఎలాంటి అంచనాలకు రాలేదు. ప్రస్తుతం పైన రిజర్వాయర్లు దాదాపు ఖాళీగానే ఉన్నాయి. ఒకవేళ ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు వస్తే దిగువకు నీళ్లు వస్తాయి. వరినాట్లు వేసేందుకు మరికొద్ది రోజులు సమయం ఉన్నందున రైతులు ఆచితూచి సాగు చేస్తే మంచిది.
– సత్యనారాయణ, తిరుమలగిరి ఇరిగేషన్ డివిజన్-2 ఈఈ