యాసంగి ధాన్యం కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగింజా తీసుకునేందుకు ముందుకు వచ్చి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండడంతో ఎక్కడా అవాంతరాలు లేకుండా అధికారులు సేకరణను పూర్తి చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో 240 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 1.57 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. 1.57లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ.309.25 కోట్లు కాగా రూ.115.65 కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరాయి. ఎప్పటికప్పుడు ఆయా శాఖల ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నల్లగొండ, మే 11 : జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ శాఖలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఐకేపీ 127, పీఏసీఎస్ 106, మార్కెటింగ్ శాఖ 7 కేంద్రాల చొప్పున మొత్తంగా 240 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటి వరకు 64,498 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ 82,464, మార్కెటింగ్ ద్వారా 10,584 మెట్రిక్ టన్నులు మొత్తంగా 1,56,645 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వర్షాలతో తడవకుండా ఉండేందుకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడే రవా ణా చేస్తూ ఇప్పటికి 1.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేర్చారు. గన్నీ బ్యాగుల విషయంలో సమస్య రాకుండా 53. 61 లక్షల బస్తాలు ఆయా కేంద్రాలకు తరలించారు. క్వింటాకు రూ.1,860 చొప్పున మొత్తంగా ఇప్పటి వరకు 23,778 మంది రైతుల నుంచి రూ.309.25 కోట్ల విలువైన ధాన్యం సేకరించిన అధికారులు రూ. 115.65 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
రెండు రోజుల్లోనే డబ్బులు జమ..
కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని సంబంధిత ఏఈఓ పరిశీలించిన తర్వాత నిర్వాహకులు కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు, రైతు పేరుతో సహా ట్యాబ్లో ఎంట్రీ చేయాల్సి ఉంది. ఈ ట్యాబ్ ఎంట్రీ పూర్తి అయిన రెండు మూడు రోజుల్లోనే డబ్బులు రైతు ఖాతాలో జమ అయ్యేలా సివిల్ సప్లయ్ శాఖ చర్యలు చేడుతుంది. ఇప్పటి వరకు రూ.309.25 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా క్షేత్రస్థాయిలో రూ.115.65 కో ట్లకు సంబంధించిన బిల్లులు ఆ శాఖకు అందాయి. అందులో ఇప్పటిదాకా రూ. 193.6 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో రూ.20 కోట్ల బిల్లులు రానుండగా అవి రెండు రోజుల్లో రైతుల ఖాతాలకు చేరనున్నాయి.
విధుల్లో 10 శాఖల యంత్రాంగం..
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేయకుండా ప్రతి గింజనూ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టి ఆయా శాఖల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు పౌర సరఫరాలు, సివిల్ సప్లయ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, రెవెన్యూ, పోలీస్, రవా ణా, తూనికలు-కొలతల శాఖలకు సంబంధించిన యంత్రాంగం, సిబ్బంది మొత్తంగా సుమారు 15 వేల మంది ఈ ప్రక్రియలో భాగస్వాములై యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపడుతున్నారు.
ఎప్పడికప్పుడు రవాణా..
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడే మిల్లులకు రవాణా చేసి దిగుమతి చేస్తున్నాం. ప్రస్తుతం వర్షాలు వస్తున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రతి కేంద్రంలో సీరియల్ నంబర్ల వారిగా తేమ శాతాన్ని బట్టి ఎప్పటికప్పుడే కాంటా వేసి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపడుతున్నాం. ఈ సీజన్లో రైతు పండించిన ప్రతి గింజ కొనేవరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయి. రైతులు సన్న ఒడ్లను మిల్లుల్లో నష్ణానికి అమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలి. –వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, నల్లగొండ
వెంటనే చెల్లింపులు చేస్తున్నాం
రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ట్యాబ్ ఎంట్రీ చేసిన రెండు, మూడ్రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. నిర్వాహకులు సైతం ట్యాబ్ ఎంట్రీ ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి. రైతులు ధాన్యం మార్కెట్కు తీసుకువెళ్లేప్పుడు సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. జిల్లాలో ఇప్పటి వరకు రూ.309 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు జరిగింది. అందులో రూ.193 కోట్లకు సంబంధించిన ట్యాబ్ ఎంట్రీలు పూర్తి అయి తమ వద్దకు బిల్లులు రాగా అందులో రూ.115 కోట్లు చెల్లించాం. డబ్బుల చెల్లింపు విషయంలో ఆలస్యం జరగకుండా చర్యలు చేపడుతున్నాం.
–నాగేశ్వర్రావు, సివిల్ సప్లయ్ అధికారి, నల్లగొండ