సూర్యాపేట, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : రైతులు సంప్రదాయ పంటలు కాకుండా లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. రోటీన్గా పండించే వరి, వేరుశనగ వంటి పంటలే కాకుండా కొత్తగా ఆలోచన చేస్తూ పండ్లు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారిస్తున్నారు. నిత్యం డిమాండ్ ఉండే కూరగాయలకు తోడు సీజనల్ వారీగా వచ్చే ఆయా రకాల పండ్లు, మంచి డిమాండ్ ఉండే ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 19,405 మంది రైతులు 39,260 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు, ఆయిల్ పామ్, మిర్చి పంటలు వేశారు. 5,457 మంది రైతులు 15,961 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేయగా.. 606 మంది రైతులు 750 ఎకరాల్లో కూరగాయలు వేశారు. 754 మంది 3,250 ఎకరాల్లో ఆయిల్ పామ్, 12,286 మంది రైతులు 19,280 మిర్చి సాగు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల విద్యుత్, కాళేశ్వరం జలాలు రావడం, మూసీ ఆధునీకరణతో వ్యవసాయం పండుగలా మారి సంతోషంగా ఉన్నారు. దాంతో సంప్రదాయ పంటలపై ఆధారపడ్డ అన్నదాతలు కొత్త పంటల సాగు వైపు మళ్లుతున్నారు. కేసీఆర్ సర్కారు సూచనలతో జిల్లాలో చాలా మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. మరికొంత మంది పండ్ల తోటలు, కూరగాయలు పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. అటువంటి రైతులను ఉద్యానవన శాఖ సబ్సిడీ రుణాలు, సాంకేతిక పరికరాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. దాంతో జిల్లాలో పదేండ్ల క్రితం 2500 ఎకరాలకు మించని పండ్లు, కూరగాయలు, మిర్చి, ఆయిల్ పామ్ పంటల సాగు ఇప్పుడు 39,260 ఎకరాలకు చేరడం గమనార్హం.
దశాబ్దాలుగా కరువుతో అల్లాడిన జిల్లా రైతులు సగం వరకు భూములను పడావు పెట్టారు. కేసీఆర్ పుణ్యమా అని కాళేశ్వరం జలాలతోపాటు 24 గంటల విద్యుత్ రావడంతో కొద్ది సంవత్సరాలుగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అయితే.. రొటీన్గా కాకుండా లాభదాయక పంటల సాగుకు రైతాంగం ఉత్సాహం చూపిస్తున్నది. ఈ క్రమంలో జిల్లాలో 400 మంది రైతులు ఆయిల్ పామ్ పంట వేశారు. 1,198 మంది రైతులు 2,871 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 3,624 మంది రైతులు 11,948 ఎకరాల్లో మామిడి, 1,425 మంది 3,092 ఎకరాల్లో నిమ్మ, 35 మంది 212 ఎకరాల్లో జామ, 14 మంది రైతులు 26 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. 26 మంది రైతులు 64 ఎకరాల్లో సీతాఫలం, 754 మంది 3,250 ఎకరాల్లో ఆయిల్ పామ్, 16 మంది రైతులు 27 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, 18 మంది రైతులు 36 ఎకరాల్లో పొప్పడి, 100 మంది రైతులు 227 ఎకరాల్లో సపోట, 99 మంది 274 ఎకరాల్లో స్వీట్ కార్న్ సాగు చేస్తున్నారు. వీటికితోడు 606 మంది రైతులు 750 ఎకరాల్లో కూరగాయలు, 12,286 మంది రైతులు 19,280 ఎకరాల్లో మిర్చి పంట వేశారు. మొత్తంగా జిల్లాలో 19,405 మంది రైతులు 39,260 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు.
మాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. గతంలో నీళ్ల సౌలత్ లేక అరకొరగా వరి, కంది, వేరుశనగ పంటలు పండించేటోళ్లం. కాళేశ్వరం నీళ్లతోటి ఆరేడేండ్ల సంది కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నం. మేము పండించిన కూరగాయలను నేరుగా అమ్ముకుంటున్నాం. మొదట్లో దళారులను నమ్మి మోసపోయినం. ఇప్పుడు నేరుగా సూర్యాపేట కూరగాయల మార్కెట్లో అమ్ముతుండడంతో మంచి లాభాలు వస్తున్నాయి. అధికారులు కూడా అప్పుడప్పుడు వచ్చి మా పంటలు చూసి సలహాలు ఇస్తున్నారు. మిగతా పంటల కంటే కూరగాయల పంటలే లాభదాయకంగా ఉన్నాయి.
నాకు నాలుగు ఎకరాల పొలం ఉన్నది. కొన్నేండ్లుగా వరి సాగు చేశాను. అందులో ఆశించిన లాభం రాలేదు. దీంతో రెండు ఎకరాల్లో వరి పొలం, రెండు ఎకరాల్లో కూరగాయల సాగు చేశాను. కూరగాయల సాగుతో అధిక లాభాలు వస్తున్నాయి. మార్కెట్లో ఇప్పుడు కూరగాయలకు మంచి ధరలు పలుకుతున్నాయి. అమ్మకాలు చేయడంతోపాటు ఇంటి అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. కూరగాయల సాగుతో మంచి అదాయం వచ్చింది.
– బానోతు నాగులు, రైతు, కోటినాయక్ తండా, ఆత్మకూర్(ఎస్) మండలం