మునుగోడు, మే 30 : మునుగోడు మండలం రావిగూడెం గ్రామంలో పంట మార్పిడి, సేంద్రీయ వ్యవసాయ సాగు విధానంపై శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ పద్మజ మాట్లాడుతూ.. పంట మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం చేసినట్లయితే భూమి సారవంతం కావడంతో పాటు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని చెప్పారు. రైతులు పత్తి విత్తనాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి రైతు విత్తనాలు కొనేటప్పుడు బిల్లులు ఖచ్చితంగా తీసుకోవాలని, బిల్లులపై ముద్రించిన వివరాలు, విత్తన ప్యాకెట్ పైన ముద్రించారా లేదా చూసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవదన్నారు.
మంచి వర్షాలు పడిన తర్వాత భూమిలో పదును ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు విత్తుకోవాలని, తొందరపడి విత్తనాలు విత్తుకోకూడదు అని రైతులకు తెలిపారు. భూమి ఉన్న ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రైతు ఆధార్ కార్డు నంబర్తో పాటు ఆదార్కు లింక్ ఉన్న ఫోన్ నంబర్ను వ్యవసాయ విస్తరణ అధికారి వద్దకు తీసుకువచ్చి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మౌనిక, గ్రామ మాజీ సర్పంచ్ గుర్రం సత్యం, రైతులు పాల్గొన్నారు.