సూర్యాపేట/ఆత్మకూర్.ఎస్, మార్చి 1 : కాళేశ్వరం ఆయకట్టుకు నీరందించాలని సూర్యాపేట జిల్లా రైతాంగం ఆందోళనకు దిగింది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు రాక పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సూర్యాపేట నియోజక వర్గంలోని ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్పహాడ్ మండలాలకు చెందిన రైతులు శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా చేశారు. ఆత్మకూర్(ఎస్) మండలం కోటపహాడ్కు చెందిన రైతు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు.
సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్పహాడ్ మండలాలకు ఎస్సారెస్పీ పరిధిలోని 69, 70, 71వ డీబీఎం కాల్వల్లో నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండి పోతున్నాయి. కేసీఆర్ సర్కారులో గత నాలుగు సంవత్సరాలు కాళేశ్వరం జలాలతో చివరి ఆయకట్టు వరకు రెండు పంటలకు నీరందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వేలల్లో పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తున్న రైతులు తీరా పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండి పోతుండడం తట్టుకోలేక ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి మరో 15 రోజుల పాటు పూర్తి సామర్థ్యంతో నీరు అందిస్తే తప్ప పంటలు కాపాడుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూర్ (ఎస్) మండలం కోటపహాడ్ గ్రామంలో ఇప్పటికే సుమారు 300 ఎకరాల్లో వరి ఎండి పోయిందని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కలెక్టరేట్కు రావడానికి ముందు కోటపహాడ్ గ్రామ రహదారిపై రాస్తారోకో చేశారు. పెన్పహాడ్ మండలం, చివ్వెంల మండలంలోనూ సాగునీరు లేక భూగర్భ జలాలు సైతం అడుగంటి బోర్లు పోయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు బంధు రాకపోయినా అప్పులు తెచ్చి పంట సాగు చేశామని, ఇప్పుడు నీళ్లు కూడా ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని వాపోయారు. తన పంట పూర్తిగా ఎండిపోతున్నదని, ప్రభుత్వం వెంటనే కాళ్వేశ్వరం నీటిని విడుదల చేయాలని నూతనకల్ మండల కేంద్రానికి చెందిన మల్లారెడ్డి అనే రైతు పురుగుల మందు తాగడానికి ప్రయత్నించాడు. రైతులు, పోలీసులు ఆయన్ని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా రైతులు ఏఓ సుదర్శన్రెడ్డికి వినతి పత్రం అందించారు.