ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, పెద్దగట్టు జాతరకు వచ్చిన భక్తుల్లో ఆ ఆనందం కనిపిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దగట్టు జాతరలో భాగంగా మంత్రి కుటుంబసమేతంగా లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో భక్తులు చాలా సౌకర్యంగా, సంతోషంగా లింగమంతులస్వామిని దర్శించుకుంటున్నారన్నారు. ఇప్పటివరకు 12 లక్షల మందికిపైగా భక్తులు వచ్చారని, రానున్న రెండ్రోజుల్లోనూ రద్దీ విపరీతంగా ఉంటుందని తెలిపారు. అన్ని శాఖల యంత్రాంగం సమన్వయంతో పని జాతరను విజయవంతం చేయాలని సూచించారు.
– సూర్యాపేట టౌన్/ సూర్యాపేట అర్బన్, ఫిబ్రవరి 7
సూర్యాపేట టౌన్/సూర్యాపేట అర్బన్, ఫిబ్రవరి 7 : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అందిస్తున్న సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, పెద్దగట్టు జాతర సంబురంగా సాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పెద్దగట్టు జాతరలో భాగంగా మంగళవారం లింగమంతుల స్వామి ఆలయంలో చంద్రపట్నం నిర్వహించగా మంత్రి తన సతీమణి సునీత, కుమారుడు వేమన్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి పెద్దగట్టుపై మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఇబ్బందులు లేవని, భక్తులు చాలా సంతోషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు సుమారు 12 లక్షల మంది జాతరలో పాల్గొన్నారని, మరో రెండు రోజులు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయ కమిటీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు.
సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే పాడి పంటలు, సిరి సంపదలతో రాష్ట్రం సుభిక్షంగా మారిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. లింగమంతుల స్వామి దయతో తెలంగాణ మరింత పురోగమించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, ఉప్పల ఆనంద్, డా.రాంమూర్తి యాదవ్, పాలక మండలి డైరెక్టర్లు, సూర్యాపేట నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
సూర్యాపేట రూరల్ : పెద్దగట్టు జాతరలో భద్రతా ఏర్పాట్లను మంత్రి జగదీశ్రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీసీ పుటేజీలను పరిశీలించారు. మంత్రి వెంట ఎస్పీ రాజేంద్రప్రసాద్, డీఎస్పీ నాగభూషణం, సీఐ సోమనారాయణసింగ్ తదితరులు ఉన్నారు.
టేకుమట్లలో గంగమ్మ జాతర
సూర్యాపేట రూరల్ : వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్దగట్టు లింగమంతుల స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం సూర్యాపేట మండలంలోని టేకుమట్ల మూసీ నది పక్కన ఉన్న గంగదేవమ్మకు పూజలు చేస్తారు. మూసీ నదిలో స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా యాదవులు భేరీ చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలతో తరలిరాగా ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.