నల్లగొండ ప్రతినిధి (నమస్తే తెలంగాణ) జనవరి 7 : కంటి వెలుగు కార్యక్రమం 100రోజుల పాటు నిర్వహిస్తున్నందున ఈ విషయంపై ఇంటింటికి అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులకు సూచించారు. కంటి వెలుగు కార్యక్రమంపై ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు. ప్రతి మండల, మున్సిపల్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. పక్కా షెడ్యూల్ ప్రకారం ఏ రోజు ఏ గ్రామంలో లేదా ఏ వార్డులో పరీక్షలు నిర్వహిస్తారనే దానిపై గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఒక్కరికీ తెలిసేలా ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రజల వద్దకే వైద్యులు వెళ్లాలనే కోణంలో ఈ కార్యక్రమం రూపకల్పన చేసినందున దానికి అనుగుణంగా ముందు కు సాగాలని సూచించారు.
గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో ప్రజా ప్రతినిధులు విధిగా హాజరై ఆయా కేంద్రాలను ప్రారంభించాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ నాయకుడే సీఎం అయినందున రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అత్యంత ప్రగతి సాధించినట్లు తెలిపారు. అధికారంలోకొచ్చిన 6నెలల్లోనే కరెంట్ కష్టాలు తీర్చి మూడేండ్లలోనే 24 గంటల పాటు ఇచ్చిన ఘనత మనదేనన్నారు. తెలంగాణ రాష్ట్రమేర్పడితే చీకిటిలోకి వెళ్తుందన్న వారి విమర్శిలు తిప్పి కొట్టామన్నారు. మంచి నీటి విషయంలో రోడ్లపై బిందెలతో బైఠాయించిన, నాయకులకు ఎదురు తిరిగిన రోజుల నుంచి ప్రస్తుతం ఇంటింటికి నల్లా ద్వారా నీరిచ్చుకునే పరిస్థితికి చేరామన్నారు. బోరు బావులపై ఆధారపడే నల్లగొండలో కరెంటు రాక గంటల కొద్ది నీటి కోసం ఎదురు చూసే పరిస్థితులు నాటివని గుర్తు చేశారు. మునుగోడు ప్రాంతంలో వెయ్యి గ్రామాల్లో ఫ్లోరోసిస్ సమస్యతో ఎంతోమంది జీవచ్ఛావాలుగా మారినట్లు తెలిపారు.
అలాంటి మునుగోడు ప్రస్తుతం మిషన్ కాకతీయతో చెరువుల పూడిక, మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి తాగునీరు ఇస్తున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ వల్ల ఫ్లోరోసిస్ తగ్గిన విషయాలు లండన్ దేశస్తులు పరిశోధించి తెలిపారన్నారు. మూడేండ్లలో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం పూర్తి చేసి అద్భుత ప్రాజెక్టుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. రెండేండ్లుగా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్, హర్యానా రాష్ర్టాలను అధిగమించి నంబర్ వన్ నిలిచిందన్నారు. దేశంలో అత్యధిక చేపలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం సైతం మనదేనని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో సైతం తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందన్నారు. దేశంలో తెలంగాణ, కేరళ, తమిళనాడులో మా త్రమే పీహెచ్సీల్లో ప్రసవాలు చేస్తున్నట్లు తెలిపారు. హరితహారంతో 240కోట్ల మొక్కలు నాటి 4శాతం అటవీ శాతం పెంచి రికార్డు సాధించినట్లు తెలిపారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 16మెడికల్ కళాశాలలు ప్రారంభించినట్లు తెలిపారు.
కంటి వెలుగు నిర్వహణకు రూ.200కోట్లు:ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.54కోట్ల మందికి ఉచితంగా పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు అందించేందుకు ప్రభుత్వం రూ.200కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. అంధత్వంతో ఎవరూ ఇబ్బంది పడొద్దనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్ ఎంతో గొప్పగా ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఉద్యోగస్తులు ఎంతో గొప్పగా చేస్తున్నందున ప్రజా ప్రతినిధులు బాధ్యతగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరముందన్నారు.
18.12లక్షల మందికి పరీక్షలే లక్ష్యం :నల్లగొండ కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి
రెండో విడుత కంటి వెలుగు కింద జిల్లావ్యాప్తంగా 18.12లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నల్లగొండ కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు. ఇందుకు గాను 74బృందాలు ఏర్పాటు చేశామని 844గ్రామాలు, 182మున్సిపల్ వార్డుల్లో షెడ్యూల్ ప్రకారం కంటి వెలుగు కేంద్రాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13వరకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి 18నుంచి నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమంలో పక్కా షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. పరీక్షల తర్వాత మందులు, ఆయిట్మెంట్, ఐ డ్రాప్స్, కళ్లద్దాలు ఉచితంగా అందిస్తామన్నారు. పెన్షన్ పంపిణీ కేంద్రాలు, రేషన్ దుకాణాల వద్ద కంటి వెలుగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామన్నారు. సదస్సులో జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, దీపికాయుగంధర్రెడ్డి, సందీప్రెడ్డి, కలెక్టర్లు పమే లా సత్పతి, హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్, రవీంద్రకుమార్, భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ విజయసింహారెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచ ంద్రనాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి, అదనపు కలెక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.
100శాతం విజయవంతం చేయాలిప్రభుత్వ విప్ గొంగిండి సునీతామహేందర్రెడ్డి
సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అందరికీ అవగాహన కల్పించి 100శాతం విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గొంగిండి సునీతా మహేందర్రెడ్డి కోరారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించి కేంద్రాలకు వచ్చే వారికి వైద్య సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సారి కొత్త టెక్నాలజీతో కార్యక్రమం నిర్వహిస్తున్నందున అందరికీ పరీక్షలు అందేలా చూడాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.