యాదాద్రి భువనగిరి, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతున్నది. కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు బారులు దీరుతున్నారు. ఉచితంగా కంటి పరీక్షలు చేస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 1,20,079 మందికి వైద్యబృందం కంటి పరీక్షలు నిర్వహించింది. యాదాద్రి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా 27 గ్రామాలు, 7 మున్సిపల్ వార్డుల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో 34 బృందాలతో కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంటి సమస్య ఉన్నోళ్లకు మందులు, చుక్కల మందులు ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 24,759 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 6,856 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేయగా, 4,552 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలను ఆర్డర్ పెట్టారు. శుక్రవారం 4,113 మందికి కంటి పరీక్షలు చేయగా, ఇందులో 935 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. 591 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలను ఆర్డర్ పెట్టారు. పోచంపల్లిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు.
సూర్యాపేట జిల్లాలో 37,894 మందికి
సూర్యాపేట : జిల్లాలో కంటి వెలుగుకు విశేష స్పందన వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 51 కేంద్రాల్లో ఇప్పటి వరకు మొత్తం 37,894 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం 6,322 మందికి కంటి పరీక్షలు చేయగా 1,606 మందికి రీడింగ్ గ్లాస్లు ఇచ్చారు. మరో 785 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. 3,114 మందికి మందులు అందించారు. శని, ఆదివారాల్లో కంటివెలుగు కేంద్రాలకు సెలవు కాగా సోమవారం తిరిగి కంటి పరీక్షలు చేయనున్నారు.
నల్లగొండ జిల్లాలో 57,426 మందికి
నీలగిరి : జిల్లాలో కంటివెలుగు కేంద్రాలకు మహిళలు, వృద్ధులు, యువత అధిక సంఖ్యలో వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 74 వైద్యబృందాలు ఇప్పటి వరకు 57,426 మందికి కంటి పరీక్షలు నిర్వహించాయి. జిల్లాలోని 61 గ్రామీణ ప్రాంతాల్లో, 13 పట్టణ కేంద్రాల్లో కంటి పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 9,541 మందికి కంటి పరీక్షలు చేయగా ఇందులో 1,482 మందికి దగ్గర, 845 మందికి దూరం చూపు సమస్య ఉండడంతో అద్దాలు పంపిణీ చేశారు. 7060 మందికి కంటి చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి రెఫర్ చేశారు. మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలోని వేములపల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సందర్శించారు. కార్యక్రమాల్లో మెడికల్ అఫీసర్లు, క్యాంపు ఆఫీసర్లు, కోఅర్డినేటర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పరీక్ష చేసి అద్దాలు ఇచ్చిండ్రు
అడవీ మధ్యలో ఉన్న మా పల్లెటూరికి ప్రభు త్వం పంపిన డాక్టర్లు వచ్చినరు. నాకు కండ్లు సరిగా కనిపించక పోవడంతో వారి దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకున్న. పెద్ద మిషన్తో డాక్టరమ్మ ఒకటికి నాలుగు సార్లు పరీక్ష చేసి కంటి అద్దాలు ఇచ్చింది. అద్దాలు పెట్టుకుంటే కండ్లు తేటాగా కనిపిస్తున్నాయి. పేదోళ్లకు ఫ్రీగా కంటి పరీక్షలు చేస్తున్న సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
–గొడుగు కిష్టయ్య, మల్లెగూడెం, రాజాపేట