నీలగిరి, ఏప్రిల్ 8 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రూ.50వేలకు పైబడిన సామగ్రి కొనుగోలు చేసి తీసుకెళ్లాల్సి వస్తే సరైన ఆధారాలు తమ వెంట ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం, బంగారం, ఇతర వస్తువులు సరఫరా కాకుండా నిరంతరం నిఘా పెడుతూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు శుభకార్యాలకు బంగారం, రూ.50 వేలకు మించి ఉన్న సామగ్రిని తీసుకెళ్లేటప్పుడు సరైన ఆధారాలు, సంబంధిత పత్రాలు వెంట ఉంచుకొని తనిఖీ అధికారులకు చూపించాలని సూచించారు. లేకుంటే సీజ్ చేస్తారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 123, భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 171బి/ 171ఇ మరియు ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
సోషల్ మీడియాతో మహిళలు జాగ్రత్తగా ఉండాలి
సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వినియోగంలో విద్యార్థినులు, మహిళలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి సూచించారు. రోజురోజుకూ విచిత్రమైన, కొత్త కొత్త ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు వస్తున్నందున మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుంచి రక్షణకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. మహిళా భద్రత కోసం పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా చేపడుతుందని, షీ టీమ్స్ ద్వారా విద్యార్థినులు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నా రు. సామాజిక మధ్యమాల్లో ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థి నులు, మహిళలకు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు సామాజిక మాధ్యమా ల్లో మెసేజ్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంటారని, అలాంటి మెసేజ్లకు స్పందించకుండా ఉండాలని తెలిపారు.