గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే తొలి విడుతలో యూనిట్లు అందుకున్న లబ్ధిదారుల జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనబడుతున్నది. గొర్రెల మందలు రెట్టింపవడంతో ఆయా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడుత పంపిణీకి సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 5న నల్లగొండలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 27,782 యూనిట్లు అందించనున్నారు. గొర్రెల ధర పెరుగడంతో ఒక్కో యూనిట్ ధరను ప్రభుత్వం రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది. ఇప్పటికే రెండో విడుతలో భాగంగా మునుగోడు నియోజక వర్గంలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 5,600 మందికి గొర్రెల యూనిట్లు అందాయి.
నల్లగొండ, మే 24 : గొల్ల, కురుమలను ఆర్థిక బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మొదటి విడుతలో పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెల ద్వారా వారి జీవన విధానం మెరుగైందన్న ఉద్దేశంతో వచ్చే నెలలో రెండో విడుత గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మంగళవారం స్పష్టతనివ్వగా జూన్ 5న రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ పథకాన్ని నల్లగొండలో ప్రారంభించనున్నారు.
తొలి విడుతలో 31,159 మందికి పంపిణీ..
75 శాతం సబ్సిడీతో గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేసేందుకు 2017 జూన్లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పశు సంవర్ధక శాఖ యంత్రాంగం 18 ఏండ్లు పైబడిన వారు 66, 132 మంది ఉన్నట్లు గుర్తించింది. సర్కారు సూచనల మేరకు వీరికి రెండు విడుతలుగా గొర్రెలను అందచేయాలని భావించి తొలి విడుతగా 32,750 మందిని ఎంపిక చేసినప్పటికీ కొందరు డీడీలు చెల్లించకపోవడంతో 31,159 మందికి అందచేసింది. 2017 జూన్ 21న జిల్లాలోని నల్లగొండ మండలం గుట్టకింది అన్నారం, అన్నారెడ్డిగూడెంలో మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. ఏడాదిన్నరలో 27,152 మందికి అందజేశారు. ఆ తర్వాత డీడీలు చెల్లించినవారికి సైతం అందచేసింది. అయితే ఆ తర్వాత ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి రెండో విడుత ఆగిపోగా తిరిగి వచ్చే నెలలో ప్రారంభించి మిగిలిన వారికి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మునుగోడు నుంచి ప్రారంభమైన రెండో విడుత..
సబ్సిడీ గొర్రెల పథకం 2017లో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత 2018లో ఎన్నికలతో ఆ పథకం తొలి విడుతలో ఆగింది. అయితే తిరిగి ఈ పథకాన్ని ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో మునుగోడు నియోజక వర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయతలపెట్టింది. అయితే ఈ పథకం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో దాన్ని ఆ నియోజకవర్గం వరకు పూర్తిచేసింది. తిరిగి ఈ పథకంలో పలు మార్పులు చేసి జూన్ 5న నల్లగొండ నుంచే షురూ చేయాలని నిర్ణయించింది. అయితే రెండో విడుతలో వాస్తవంగా 33,382 మందికి గొర్రెల యూనిట్లు ఇవ్వాల్సి ఉండగా, మునుగోడు నియోజకవర్గంలో ఇచ్చిన ప్రత్యక్ష నగదు బదిలీ లబ్ధిదారులు 5,600 మంది పోగా మరో 27,782 మందికి ఇవ్వనున్నారు. వీరికి యూనిట్ కాస్ట్ రూ.1.75 లక్షలకుగాను అందులో 25 శాతం వ్యక్తిగత కంట్రిబ్యూషన్ రూ.43,750 డీడీ రూపంలో చెల్లించాల్సి ఉండగా, మిగిలిన రూ.1,31,250 ప్రభుత్వం సబ్సిడీ చెల్లించి ఇవ్వనున్నది.
గొల్ల, కురుమలకు భరోసా..
సబ్సిడీ గొర్రెల పంపిణీ జిల్లాలోని గొల్ల, కురుమల జీవన విధానాన్ని మెరుగపర్చిందని చెప్పవచ్చు. వివాహం అయినా, కాకపోయినా ఒకే ఇంట్లో తండ్రితోపాటు ఇద్దరు, ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ అందరిని పరిగణనలోకి తీసుకోని ఎంపిక చేశారు. దాంతో ఇప్పటికే తొలి విడుతలో ఒకే ఇంట్లో ఒకటికి పైగా యూనిట్లు అందగా రెండో విడుతలోనూ అందనున్నాయి. తొలి విడుతలో పంపిణీ చేసిన గొర్రెలు ఈ ఐదేండ్ల కాలంలో ఏడెనిమిది రెట్లు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆయా గ్రామాల నుంచే పట్టణాలకు మాంసం ఎగుమతి అవుతున్నది. ఈ పథకం ద్వారా యాదవులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని సర్కారు సర్వేలో తేలడంతో రెండో విడుత పంపిణీకి చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం గొర్రెల ధరలు పెరుగడంతో యూనిట్ కాస్ట్ గతానికంటే పెంచి పంపిణీ చేస్తున్నారు.
పకడ్బందీగా
గొర్రెల పంపిణీ విషయంలో ప్రతి ఇంట్లో 18 ఏండ్లు నిండిన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వం ఈ సారి అంతకుమించిన ప్రణాళికలతో పకడ్బందీగా పంపిణీ చేసే అవకాశం ఉన్నదని పశు సంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ ఇప్పటికే తయారు చేయగా అందులో మరిన్ని మార్పులు చేసి ప్రతి లబ్ధిదారులు పక్కాగా గొర్రెలు కొనుగోలు చేయటంతోపాటు వాటిని దిగుమతి చేసుకొని వాటి ద్వారా వారి జీవన విధానం మెరుగుపర్చుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన. ప్రతి లబ్ధిదారుడికి 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలు ఇవ్వనుండగా వాటి కొనుగోలు స్థలం, గొర్రెల ఫొటో, లబ్ధిదారుడి ఫొటో, వాహనం ఫొటో, చెవి పోగు, కొనుగోలు, అమ్మకందారులతోపాటు పశు సంవర్ధక శాఖ అధికారుల ఫొటోలు తీసీ సదరు యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి దశను జీపీఎస్ సిస్టమ్ ద్వారా పరిశీలించడంతోపాటు మరిన్ని నిబంధనలు పెట్టే అవకాశం ఉన్నది.
రెండో విడుత పంపిణీకి ఏర్పాట్లు..
రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా ఇప్పటికే మనుగోడు నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా అందజేసినప్పటికీ ఆ పద్ధతిలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దాంతో మళ్లీ మార్పులు చేసి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జూన్ 5న మిగిలిన అన్ని ప్రాంతాల్లో పంపిణీ చేయాల్సి ఉండగా, నల్లగొండలో నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. గొర్రెల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
– యాదగిరి , పశు సంవర్ధక శాఖ అధికారి, నల్లగొండ