భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 30 : మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జెండగే సూచించారు. భువనగిరి నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వాటిలో 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని, మరో 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, మిగతా 39 మంది పోటీలో ఉన్నట్లు తెలిపారు. వీరి కోసం 3 ఈవీఎంలను ఉపయోగించనున్నట్లు చెప్పారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల వ్యయం నమోదుపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 2,141 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 18,08,585 ఓటర్లు ఉన్నారని, వీరిలో 8,98,416 మంది పురుషులు, 9,10,090 మంది స్త్రీలు, 79 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు.
ప్రశాంత వాతావరణంలో పారదర్శక ఎన్నికల నిర్వహణకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో స్టాటిస్టికల్ సర్వే లెన్స్, వీడియో సర్వే లెన్స్, వీడియో వీవింగ్ టీమ్ల ద్వారా నిబంధనలకు లోబడి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 245 మంది సెక్టార్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, ఒక సెక్టార్ అధికారి 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. ఇప్పటివరకు రూ.9,43,17,069 విలువైన మద్యం, ఆభరణాలు, డ్రగ్స్, డబ్బు పట్టుబడినట్లు చెప్పారు. సువిధ ద్వారా ఆన్లైన్ అనుమతులు పొందాలని, ఆఫ్లైన్ అనుమతి కోసం సహాయ రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని, ప్రతి ఒక్కటీ ఎన్కోర్లో నమోదవుతుందని తెలిపారు. సి-విజిల్ యాప్ను అందరూ వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రవర్తనా నియమాళి ఉల్లంఘనపై ఫిర్యాదు చేయాలని, 1950 హెల్ప్లైన్ను వినియోగించుకోవాలని సూచించారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అకడే డిస్ట్రిబూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, జూన్ 4న భువనగిరి పట్టణంలోని అరోరా కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్చంద్ర మాట్లాడుతూ.. జిల్లాలోని 816 పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 6 ఎంసీసీ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని, 3 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈవీఎంల భద్రత, కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు, మైక్రో అబ్జర్వర్ల పరిశీలన ఉంటుందన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ పాల్గొన్నారు.